హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) సీజన్-5లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు రాప్టర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు జట్టు 5-0తో అవధె వారియర్స్పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల సింగిల్స్లో బ్రైస్ లెవెర్డెజ్, తై జు యింగ్ నెగ్గి బెంగళూరును ఆధిక్యంలో నిలిపారు.
కోహ్లీ ఫిట్నెస్ గురించి ఆశ్చర్యకర విషయాలు చెప్పిన ఎమ్మెస్కే.. విరాట్ తర్వాతే రొనాల్డో, మెస్సీ!
'ట్రంప్' మ్యాచ్లో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్ విజయం సాధించడంతో బెంగళూరు రాప్టర్స్ రెండు 'ట్రంప్' మ్యాచ్ల్లోనూ గెలిచి సెమీస్కు వెళ్లే అవకాశాన్ని సులభతరం చేసుకుంది. ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ వారియర్స్, చెన్నై సూపర్స్టార్స్, పుణే సెవెన్ ఏసెస్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగే తొలి సెమీస్లో చెన్నైతో నార్త్ ఈస్ట్రన్, శనివారం జరిగే రెండో సెమీస్ మ్యాచ్లో పుణెతో బెంగళూరు తలపడనున్నాయి.
తొలుత జరిగిన పురుషుల డబుల్స్లో అరుణ్ జార్జి-రియాన్ అగుంగ్ సపుట్రో (రాప్టర్స్) జోడీ 15-14, 7-15, 11-15తో సంగ్ హ్యూన్-షిన్ బెక్ చియోల్ (అవధె) ద్వయం చేతిలో ఓడిపోయింది. అయితే అవధె 'ట్రంప్' పోరులో జయరామ్ 9-15, 9-15తో లెవెర్డెజ్ (రాప్టర్స్) చేతిలో ఓడిపోవడంతో రాప్టర్ పుంజుకుంది. మరోవైపు మహిళల సింగిల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (రాప్టర్స్) 15-12, 15-12తో బీవెన్ జాంగ్ (అవధె)పై జయకేతనం ఎగురవేసింది.
అనంతరం రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్ను బెంగళూరు 'ట్రంప్'గా ఎంచుకోగా సాయి ప్రణీత్ (రాప్టర్స్) 15-11, 15-13తో విన్సెంట్ (అవధె)ను ఓడించాడు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 4-0తో అవధెపై రాప్టర్స్ గెలుపును ఖాయం చేసుకుంది. ఇక చివరి మిక్స్డ్ డబుల్స్ పోరులో చన్ పెంగ్ సూన్-ఇయోమ్ హి వోన్ (రాప్టర్స్) జోడీ 7-15, 15-12, 15-11తో సంగ్ హ్యూన్-క్రిస్టీనా పెడర్సన్ (అవధె) జంటపై గెలిచింది.
సెమీఫైనల్స్ పోరు:
# నార్త్ఈస్టర్న్ vs చెన్నై (శుక్రవారం)
# బెంగళూరు vs పుణె (శనివారం)