హైదరాబాద్: భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ సెమీస్లో అద్భుత ప్రదర్శన చేయడంతో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అవధె వారియర్స్పై 2-4 తేడాతో బెంగళూరు రాఫ్టర్స్ విజయం సాధించింది.
సెమీస్లో తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్ను అవధ్ 'ట్రంప్'గా ఎంచుకుంది. ఈ పోరులో అశ్విని పొన్నప్ప-క్రిస్టియన్సెన్ జోడీ 15-7, 15-10తో ఎల్లిస్, మిల్స్ ద్వయంపై విజయం సాధించి అవధెకు శుభారంభం అందించింది. వరుస విజయాల ఊపును కొనసాగిస్తూ సెమీస్లోనూ జట్టుకు 2-0తో తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారు.
అయితే, రెండోదైన పురుషుల తొలి సింగిల్స్లో సాయి ప్రణీత్ 15-9, 15-4తో లి డాంగ్ కుయెన్ ఓడించి ఆతిథ్య జట్టును రేసులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు రాఫ్టర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రీకాంత్ తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేదు. రెండో సింగిల్స్లో శ్రీకాంత్ 15-7, 15-10తో సన్ వాన్ హోను ఓడించడంతో స్కోరు 2-2తో సమమైంది.
ఆఖరి మ్యాచ్ను బెంగళూరు ట్రంప్గా ఎంచుకుంది. నిర్ణయాత్మకమైన ఈ పోరులో మహమ్మద్ ఎహ్సాన్-హింద్రా సెటియవాన్ జోడీ 15-14, 15-9తో యాంగ్ లీ-క్రిస్టియన్ సెన్ జంటను ఓడించి బెంగళూరును ఫైనల్ చేర్చింది. హైదరాబాద్ హంటర్స్, ముంబై రాకెట్స్ మధ్య శనివారం జరిగే రెండో సెమీస్ విజేతతో ఫైనల్లో బెంగళూరు తలపడనుంది.