హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ చాంపియన్గా నిలిచింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో బెంగళూరు 4-3 స్కోరుతో ముంబై రాకెట్స్ను ఓడించింది. బెంగళూరు రాఫ్టర్స్ జట్టు కెప్టెన్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో 15-7,15-10 స్కోరుతో రాకెట్స్ ఐకాన్ షట్లర్ ఆంటోన్సెన్పై గెలిచి జట్టు చాంపియన్షిప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
ఆసీస్ గడ్డపై తాను సెంచరీ సాధించిన అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ ఓటమిపై రోహిత్ ఇలా
మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్ను 'ట్రంప్'గా ఎంచుకున్న ముంబై రాకెట్స్ ఇందులో గెలిచి శుభారంభం చేసింది. కిమ్ జీ జాంగ్-బెర్నడెత్ (ముంబై) జంట 15-8, 15-14తో మార్కస్ ఎలిస్-లారెన్ స్మిత్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15-7, 15-10తో అంటోన్సెన్ (ముంబై)పై నెగ్గి 1-2తో రాకెట్స్ ఆధిక్యాన్ని తగ్గించాడు.
ఇక, బెంగళూరు 'ట్రంప్' మ్యాచ్గా ఎంచుకున్న మహిళల సింగిల్స్లో తి ట్రంగ్ వు 15-8, 15-9తో శ్రియాన్షి పరదేశి (ముంబై)ని చిత్తుచేసింది. ఫలితంగా బెంగళూరు 3-2తో ముందంజ వేసింది. అయితే రెండో పురుషుల సింగిల్స్లో తెలుగు షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ (బెంగళూరు) 15-7, 12-15, 3-15తో సమీర్ వర్మ (ముంబై) చేతిలో ఓడాడు.
దీంతో ఇరు జట్లు 3-3తో సమానంగా నిలిచాయి. కీలకమైన ఐదో, ఆఖరి మ్యాచ్ పురుషుల డబుల్స్లో బెంగళూరు జోడీ అహ్సాన్-సెతియవాన్ 15-13, 15-10 స్కోరుతో ముంబై జోడీ జంగ్-లీయాంగ్పై నెగ్గడంతో బెంగళూరు రాప్టర్స్ నాలుగో సీజన్ విజేతగా అవతరించింది. విజేతగా నిలిచిన బెంగళూరు రాప్టర్స్కు రూ. 3 కోట్ల ప్రైజ్మనీ లభించింది.