హైదరాబాద్: తాను గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని వీడినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని భారత స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ స్పష్టంచేశాడు. తాను గోపీ అకాడమీలోనే కొనసాగుతానని తెలిపాడు.
'గాయం కాకుండా ఉండుంటే నేను కూడా ఒలింపిక్స్ వెళ్ళేవాడినే. ఒలింపిక్స్కు ముందే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా. ఆ సమయంలో ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శిక్షణలో కోచ్ గోపీచంద్ నిమగ్నమయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో నాపై దృష్టిసారించడం కుదరదు. అందుకే బెంగళూరులో కోచ్ టామ్ జాన్ దగ్గరికి వచ్చాను' అని కశ్యప్ వివరించాడు.

'2005లో గోపీ అకాడమీలో టామ్ నాకు శిక్షణ ఇచ్చాడు. అతనితో నాకు పరిచయముంది. గాయం నుంచి కోలుకున్నాక టామ్ అకాడమీలోనే సాధన చేస్తున్నా. సెప్టెంబర్ నెలలో జరిగే ఇండోనేసియన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నా. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ నుంచి గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటా'అని కశ్యప్ తెలిపాడు.
పారుపల్లి కశ్యప్.. గోపీచంద్ అకాడమీని వీడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పారుపల్లి కశ్యప్ ఈ అంశంంపై మాట్లాడుతూ పై విధంగా స్పష్టతనిచ్చాడు. కాగా, ఇప్పటికే సైనా నెహ్వాల్.. గోపీచంద్ అకాడమీకి దూరమై.. బెంగళూరులో మరో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.