ఒలింపిక్స్లో మూడో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కంచు మోత మోగించిన సింధు.. పారిస్ ఒలింపిక్స్లో మాత్రం ప్రిక్వార్టర్స్కే పరిమితమైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో చైనా షట్లర్ హే బింగ్జావ్ చేతిలో 19-21, 14-21 తేడాతో ఓటమిపాలై విశ్వక్రీడల నుంచి నిష్క్రమించింది.
తొలి గేమ్ హోరాహోరీగా సాగిన పీవీ సింధు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. క్రాస్ కోర్ట్ షాట్స్తో సింధు, స్మాష్లతో చైనా ప్లేయర్ సత్తా చాటింది. కాగా, అంతిమంగా తొలి గేమ్ను చైనా ప్లేయర్ చేజిక్కుంచుకుంది. రెండో గేమ్లో ప్రత్యర్థిని సింధు ప్రతిఘటించలేకపోయింది. ఆఖర్లో సింధు పుంజుకున్నా అది పాయింట్ల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.

కాగా, తన ఓటమికి గల కారణాల గురించి సింధు వివరించింది. అలాగే వచ్చే ఒలింపిక్స్ వరకు కొనసాగుతుందా లేదా అనే విషయాలు గురించి స్పందించింది. ''వచ్చే ఒలింపిక్స్కు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత ఆలోచిస్తాను. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాను. ఇది చాలా బాధాకరం. మొత్తంగా మ్యాచ్లో నా తప్పులను నియంత్రించాల్సింది. ముఖ్యంగా రెండో గేమ్లో''
''తొలి గేమ్లో ఓ దశలో 19-19తో సమానంగా ఉన్నా, దాన్ని విజయంగా ముగించలేకపోవడం బాధగా ఉంది. ప్రతి పాయింట్ కోసం పోరాడాను. సులభంగా పాయింట్లు వస్తాయని, సులభమైన పోటీ ఉంటుందని భావించలేం. డిఫెన్సివ్ చేస్తూ అయినా నా తప్పులను నియంత్రించాల్సింది. కొన్ని స్మాష్లు కోర్టు బయటపడ్డాయి. దాన్ని లోపలకి కొట్టి ఉంటే పాయింట్లు దక్కేవి. నివారించదగిన కొన్ని తప్పులు కొనసాగాయి. అవి ప్రత్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. చైనా షట్లర్ బాగా ఆడింది''
''పారిస్ ఒలింపిక్స్ కోసం ఎంతో కష్టపడ్డాను. మరి కొంచెం సన్నద్ధమవ్వాల్సింది కదా.. అనే ఫీలింగ్ లేదు. ఎందుకంటే నాకు సాధ్యమైనంతగా ప్రిపేర్ అయ్యాను. ప్రతీది చేశాను. ఇక మిగిలింది విధి అని భావిస్తున్నాను'' అని పీవీ సింధు అని పేర్కొంది.