పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో 13 రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. అయితే ఈ అతి పెద్ద క్రీడా ఈవెంట్లో బ్యాడ్మింటన్ ఈవెంట్ 'డ్రా' వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య శుక్రవారం విడుదల చేసింది.
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్లకు సులువైన డ్రా లభించింది. గ్రూప్ దశను వీరిద్దరు అధిగమించడం దాదాపు ఖాయమే. పారిస్ ఒలింపింక్స్లో పదో సీడ్గా బరిలోకి దిగుతున్న సింధు గ్రూప్-ఎమ్లో రెండు మ్యాచ్లు ఆడనుంది. ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో సింధు తలపడనుంది.

ఈ ప్రత్యర్థులు కంటే బలమైన సింధు గ్రూప్ దశను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. అయితే ప్రిక్వార్టర్స్లో చైనా ప్లేయర్, ఆరో సీడ్ హి జింగ్జియావోతో సింధు తలపడే అవకాశాలు ఉన్నాయి. హెడ్ టు హెడ్ రికార్డుల్లో సింధు 9-11తో కాస్త వెనుకంజలో ఉన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రిక్వార్టర్స్లో సింధు గెలిస్తే.. క్వార్టర్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి చెన్ యు ఫైతో పోటీపడాల్సి ఉంటుంది. ముఖాముఖీ రికార్డుల్లో ఇద్దరూ 6-6తో సమంగా ఉన్నారు.
చక్కని ప్రదర్శన చేస్తే సింధు సెమీఫైనల్కు చేరుకోవడం ఖాయమే. అయితే సెమీస్లో కఠిన ప్రత్యర్థి, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడాల్సి ఉంటుంది. అయితే హెడ్ టూ హెడ్ రికార్డుల్లో కరోలినాకు మెరుగైన రికార్డు ఉంది. వీరిద్దరు ఇప్పటివరకు 17 సార్లు తలపడగా సింధు అయిదు సార్లు మాత్రమే గెలిచింది. కరోలినాపై సింధు గెలిస్తే పతకం ఖాయమవుతోంది. అప్పుడు సింధు చరిత్ర సృష్టిస్తుంది. ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక భారత ప్లేయర్గా రికార్డు సృష్టిస్తుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్లో లీ డక్ఫాట్ (వియత్నాం), ఫాబియన్ రోత్ (జర్మనీ)తో ప్రణయ్ గ్రూప్-కేలో తలపడనున్నాడు. అలాగే గ్రూప్-ఎల్లో ఉన్న లక్ష్యసేన్.. జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా), జూలియెన్ కరాజి (బెల్జియం) పోటీపడనున్నాడు. గ్రూప్ దశలో అగ్రస్థానాల్లో నిలిస్తే ప్రిక్వార్టర్స్లో ప్రణయ్, లక్ష్యసేన్ పోటీపడే అవకాశముంది.