జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి చవి చూసింది. ఫైనల్లో కరోలినా చేతిలో రెండు వరుస సెట్లలో ఓడిపోయింది. 16-21, 19-21 తేడాతో ఆదివారం జరిగిన వరుస సెట్లలో ఓడిపోయింది. రెండో స్థానంలో నిలిచింది. దీంతో సైనా రజతంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా భారత తరపున ప్రపంచ ఛాంపియన్ షిప్లో తొలి రజత పతకం సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సైనాను అభినందించారు.
కాగా, అంతకుముందు రోజు
భారత బ్యాడ్మింటన్లో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. స్టార్ షట్లర్, హైదరాబాదీ సైనా నెహ్వాల్కు ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో మరో అద్భుత విజయం సాధించింది.
మొన్న క్వార్టర్స్ గండాన్ని అధిగమించి అభిమానుల ఆశల్ని నిలిపిన సైనా నెహ్వాల్.. తాజాగా సెమీఫైనల్లోనూ విజయదుందుభి మోగించి విశ్వ కిరీటాన్ని అందుకునేందుకు అడుగుదూరంలో నిలిచింది. ఈ మెగా ఈవెంట్లో ఫైనల్ చేరిన తొలి భారతీయ షట్లర్గా చరిత్ర సృష్టించిన సైనా టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కరోలినా మారిన్తో ఆదివారం తలపడనుంది.

శనివారం హోరాహోరీగా సాగిన సెమీస్లో రెండో సీడ్ సైనా 21-17, 21-17తో అన్సీడెడ్ లిండావెని ఫనేత్రి (ఇండోనేషియా)ని ఓడించింది. యిహాన్ వాంగ్ (చైనా)తో క్వార్టర్ఫైనల్లో సైనా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఆ మ్యాచ్లో సుదీర్ఘ ర్యాలీలతో పాటు నెట్ గేమ్, క్రాస్కోర్టు, డ్రాప్ షాట్లు.. ఇలా అన్ని రంగాల్లో కచ్చితత్వం ప్రదర్శించింది.
క్వార్టర్స్తో పోల్చుకుంటే సెమీస్ గొప్పగా ఏమీ సాగలేదు. సైనా చాలా తప్పిదాలే చేసింది. కానీ, ఎలాగైనా గెలవాలన్న పట్టుదలే ఆమెను నిలబెట్టింది. వెనకబడినా పుంజుకుని వరుస గేమ్ల్లో మ్యాచ్ ముగించింది. మ్యాచ్లో తొలి పాయింటు గెలిచిన సైనా అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి పాయింట్లు ఇచ్చుకుంది. దీంతో ఫనేత్రి 6-2 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ఆరంభంలో స్టేడియంలోని గాలి వాటంతో సైనా ఇబ్బంది పడింది.
ఆ సమయంలో ఫనేత్రి మోకాలి గాయానికి చికిత్స తీసుకోవడం ఆమెకు కలిసొచ్చింది. విరామ సమయం సైనాను తిరిగి ఆటపై ఏకాగ్రత నిలిపేలా చేసింది. గాయంతో పోరాడుతూనే ఫనేత్రి.. సైనాకు గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్ 9-9, 10-10తో నువ్వానేనా అన్నట్లు సాగింది. 11-10తో విరామానికి వెళ్లిన సైనా తర్వాత 15-12తో స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది.
అయితే అనవసర తప్పిదాలు చేయడంతో ఫనేత్రి 15-15తో స్కోరును సమం చేసింది. గేమ్ కీలక దశలో పుంజుకున్న సైనా 19-17తో గేమ్కు చేరువైంది. వరుసగా రెండు పాయింట్లతో తొలి గేమ్ సాధించింది. రెండో గేమ్లోనూ.. మోకాలి నొప్పి వేధిస్తున్నా ఫనేత్రి తేలిగ్గా తలొగ్గలేదు. సైనాను శ్రమించేలా చేసింది. తొలి గేమ్తో పోల్చుకుంటే రెండో గేమ్లో సైనా ఆట మెరుగైంది.
ఆమె ఆధిక్యం సాధించిన ప్రతిసారీ ఫనేత్రి స్కోరు సమం చేస్తూ వచ్చింది. 6-6, 10-10తో గేమ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్ను తలపిస్తూ 11-10తో విరామానికి వెళ్లిన సైనా తర్వాత 14-11తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, మరోసారి లిండావెని 14 పాయింట్ల వద్ద సైనాను అందుకుంది. అక్కడి నుంచి సైనా.. ఫనేత్రికి చిక్కలేదు. 17-14తో గేమ్పై పట్టు సాధించిన సైనా.. ఆఖర్లో వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్ గెలిచింది.
కాగా, సైనా ఫైనల్లో తలపడబోయే కరోలినా ప్రస్తుతం 80612 పాయింట్లతో నెం.1గా కొనసాగుతోంది. సైనా (79192)కు ఆమెకు మధ్య అంతరం 1420 పాయింట్లే. ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతకు 12000.. రన్నరప్కు 10200 పాయింట్లు లభిస్తాయి. సైనా గెలిస్తే ఆమె పాయింట్లు 91192కు చేరతాయి. అప్పుడు మారీన్ 90812 పాయింట్లతో రెండో స్థానానికి పడుతుంది.
ఫైనల్ చేరతానని ఊహించలేదు: సైనా
'ఫైనల్ చేరుతానని అస్సలు అనుకోలేదు. ఫనేత్రితోనే కాదు.. ఇక్కడి జనంతోనూ పోటీపడ్డా. ఆమెకు దక్కిన పాయింట్లన్నీ నేను ఒత్తిడిలో చేసిన తప్పిదాలే. టోర్నీలో ఇప్పటిదాకా ఫనేత్రి బాగా ఆడింది. సెమీఫైనల్లో ప్రతిఘటన ఎదురవుతుందని తెలుసు. అందుకు తగినట్టే సన్నద్ధమయ్యా. కరోలినా మారిన్తో తుదిపోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఆల్ ఇంగ్లాండ్కు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆడబోతున్నాం' అని సైనా పేర్కొంది.