హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఇటీవల చత్తీస్గఢ్లో నక్సలైట్లతో ఎన్కౌంటర్లో అమరులైన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించింది.
ఈ సందర్భంగా సైనా మీడియాతో మాట్లాడింది. గతవారం జరిగిన మావోయిస్టుల దాడిలో జవాన్లు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచి వేసిందని, తీవ్రమైన మనోవేదనతో బాధపడుతున్న జవాన్ల కుటుంబాలకు తన వంతుగా ఆర్థికసాయం అందించానని పేర్కొంది.

'తమ ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడే జవాన్లు దుర్మరణం పాలు కావడంతో మనసంతా బాధతో నిండిపోయింది. వారి ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం. వారి కుటుంబానికి నా వంతుగా చిన్న సాయం చేయాలని నిర్ణయించున్నా. 12 మంది జవాన్ల కుటుంబానికి రూ.6 లక్షలు ఇస్తున్నాను' అని సైనా పేర్కొంది.
శుక్రవారం సైనా తన 27వ పుట్టినరోజుని జరుపుకుంది. సైనా పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా 12 మంది జవాన్ల కుటుంబాలకు రూ.1.08 కోట్లు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే.