న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ప్రారంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్ గోయల్ మరోసారి తన అవగాహన రాహిత్యంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్కు కాంస్య పతకాలు వచ్చిన విషయం ప్రపంచమంతటికీ తెలిసిందే.
అయితే, సింధు, సాక్షి మాలిక్లను రియో స్వర్ణ పతక విజేతలుగా పేర్కొన్నారు విజయ్ గోయెల్. దీంతో నెటిజన్లు ఈ కేంద్రమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. కాగా, రియో విజేతలు, క్రీడా అవార్డుల గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కలిసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోయల్.. 'ప్రధాని మోడీ నేడు ఖేల్రత్న, ధ్యాన్చంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు. రియో స్వర్ణ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్లు కూడా ప్రధానిని కలిశారు' అని అన్నారు.

కొద్ది క్షణంలోనే ఈ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో గోయల్పై విమర్శలు సంధించారు నెటిజన్లు. కమెడియన్ కపిల్ శర్మకు గోయల్ ఏమాత్రం తీసిపోరని, కొందరు, గోయల్ మళ్లీ మర్చిపోయారని మరికొందరు ట్వీట్లు చేశారు. కొందరైతే గోయల్ను మత్తు దిగే వరకు రియోలోనే ఉంచితే బాగుండేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అయితే ఈ ఘటనపై గోయల్ స్పందించారు. 'పొరపాట్లు జరుగుతుంటాయి. రియో పతక విజేతలు అనబోయి, స్వర్ణ పతకధారులు అన్నాను. దీన్ని ఇంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు.. రానున్న రోజుల్లో మనం బంగారం పతకం సాధిస్తామేమో' అని సమర్థించుకోవడం విశేషం.
గతంలోనూ రియో ఒలింపిక్స్ అథ్లెట్ల విషయంలో గోయల్ కొన్ని సార్లు పొరబడ్డారు. అథ్లెట్ శ్రావణి నందాకు గుడ్లక్ చెబుతూ.. ద్యుతిచంద్ ఫొటోను పోస్టు చేశారు. దీపా కర్మాకర్ పేరును కూడా దీపా కర్మనాకర్ అని ట్వీట్ చేశారు. అప్పుడు కూడా నెటిజన్లు తీవ్ర స్థాయిలోనే సెటైర్లు సంధించారు.