హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్ధానమే లక్ష్యమని ప్రకటించిన స్టార్ షట్లర్ పీవీ సింధు ఆ దిశగా పయనిస్తోంది. బీడబ్ల్యూఎఫ్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో పీవీ సింధు కెరీర్లోనే అత్యుత్తమంగా ఐదో ర్యాంకుని దక్కించుకుంది.
తద్వారా సైనా నెహ్వాల్ తర్వాత టాప్-5లో అడుగుపెట్టిన భారత మహిళా షట్లర్గా రికార్డు నెలకొల్పింది. జనవరిలో స్వదేశంలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ను సాధించిన సింధు తన ర్యాంకు మెరుగుపర్చుకుంది.

మహిళల సింగిల్స్లో 69,399 పాయింట్లతో కెరీర్లో తొలిసారిగా ఐదో ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పీవీ సింధుకు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇప్పటికే టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా ముఖేశ్ అంబానీ, కేంద్రమంత్రి విజయ్ గోయల్ తదితరులు సింధుని అభినందించిన వారిలో ఉన్నారు. 'కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించిన సింధుకు శుభాకాంక్షలు, స్త్రీ శక్తిని చాటావు, ఈ తరం అమ్మాయిలకు నువ్వే స్ఫూర్తి' అంటీ నీతా అంబానీ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే మరో హైదరాబాద్ స్టార్ సైనా నెహ్వాల్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తై జు యింగ్ (చైనీస్ తైపీ), కరోలినా మారిన్ (స్పెయిన్), హ్యున్ సంగ్ (కొరియా), సున్ యు (చైనా) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. గత ఏడాది ఇదే సమయానికి ప్రకటించిన ర్యాంకుల్లో సింధు 12వ ర్యాంకులో ఉండగా, సైనా 2 ర్యాంకులో ఉంది.