హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి మంచి ప్రోత్సాహకం దక్కింది. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకంతో పాటు గత మూడేళ్ళుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సిక్కికి కారు ఇవ్వనున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ఇటీవల ప్రకటించారు. గురువారం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సిక్కికి ఫోర్డ్ కారును బహుకరించారు. నాగార్జున చేతుల మీదుగా సిక్కికి కారు అందజేశారు.
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు బ్లాస్టర్ తరఫున సిక్కిరెడ్డి ఆడుతుంటే ఈలలు వేశానని.. గెంతులేశానని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. భవిష్యత్తులో సిక్కి మరెన్నో ఘనతలు సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నాగార్జున మాట్లాడుతూ:
' పీబీఎల్లో సిక్కిరెడ్డి మ్యాచ్ చూస్తూ ఈలలు వేశా.. గెంతులేశా. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. మరెన్నో ఘనతలు సాధిస్తుంది. గోపీచంద్ ఛాంపియన్లను తయారు చేస్తున్నాడు. బయట ఎక్కడికి వెళ్ళినా గోపీచంద్ నాకు తెలుసు అని గర్వంగా చెప్పుకుంటా' అని నాగార్జున అన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన గోపీచంద్:
'గత కొన్నేళ్లుగా డబుల్స్కు ఆదరణ పెరుగుతోంది. సిక్కిరెడ్డి గాయం నుంచి కోలుకుని డబుల్స్లో ఈస్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. ఆమె కెరీర్కు ఇది ఆరంభమే. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించడం ఖాయం. చాముండేశ్వరినాథ్ ఇప్పటి వరకు 17 కార్లు ఇచ్చారు. త్వరలోనే ఆ సంఖ్య 25, 50 చేరుకోవాలని కోరుకుంటున్నా'నని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపాడు.
ఇంతకంటే పెద్దది:
'జ్వాల, అశ్విని తర్వాత హైదరాబాద్ నుంచి ఎంతోమంది ప్రపంచ స్థాయి డబుల్స్ క్రీడాకారులు వస్తున్నారు. మూడేళ్లుగా డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో సిక్కి మంచి ఫలితాలు సాధిస్తోంది. ఆల్ ఇంగ్లాండ్ లేదా ఆసియా ఛాంపియన్షిప్ గెలిస్తే సిక్కికి పెద్ద కారు బహుకరిస్తా' అని చాముండి చెప్పాడు.