హైదరాబాద్/పశ్చిమగోదావరి: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ఫైనల్ చేరిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆమె బ్యాడ్మింటన్ పోటీల్లో ఫైనల్కు చేరుకోగానే పలువురు క్రీడా ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు సింధును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
తాజాగా, నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సింధు ప్రతిభను మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింధు లక్షలాది మంది అమ్మాయిలకు స్ఫూర్తి అని కవిత వ్యాఖ్యానించారు. సింధు గెలుపు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికి కూడా గర్వకారణమని పేర్కొన్నారు. సింధు ఫైనల్లో గెలిచి స్వర్ణం సాధిస్తే తాను అమ్మ వారికి బంగారు బోనం సమర్పిస్తానని కవిత ట్వీట్ చేశారు.
సింధు సాధిస్తున్న విజయాలు అమ్మాయిల్లో క్రీడాసక్తిని పెంచుతోందన్నారు. టైటిల్ పోరులోనూ సింధు విజయం సాధిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోందని ఆమె చెప్పారు. కాగా, శుక్రవారం సాయంత్రం సింధు.. కరోలినా మారిన్తో ఫైనల్ పోటీల్లో తలపడనుంది.
గెలుపు కోసం: రాట్నాలమ్మను దర్శించుకున్న సింధు తండ్రి
పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలోని రాట్నాలమ్మ ఆలయాన్ని బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తండ్రి రమణ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో సింధు గెలిచి దేశానికి స్వర్ణపతకం అందించాలని ఆయన అమ్మవారిని వేడుకున్నారు.
కాగా, గుడికెళ్లడం, ఆడటం, గెలవడం అనేది సింధు కుటుంబ సెంటిమెంటుగా తెలుస్తోంది. సింధు తల్లి కూడా ఇదే చెబుతున్నారు. సింధు ఏ టోర్నీలో ఫైనల్ కెళ్లినా ఆమె తండ్రి పీవీ రమణ రట్నాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తారని చెప్పారు. ఇలా చేయడం వల్ల చాలాసార్లు సింధు ఆటలో గెలుపొందిందని తెలిపారు. ఇదొక సెంటిమెంటుగా మారిపోయిందని చెప్పుకొచ్చారు.