న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఎన్నో విజయాలను భారత్కు అందించిన సైనా.. గత కొంత కాలంగా గాయాలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే సైనా ఈ మేరకు ప్రకటించినట్లు తెలుస్తోంది.
వెంటాడుతున్న గాయాల కారణంగా తన కెరీర్ అర్ధంతరంగా ముగిసే అవకాశం ఉందని సైనా నెహ్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న సైనా.. మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించింది.
నవంబర్ 15న ఆరంభమయ్యే చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో ఆమె బరిలోకి దిగనుంది. అయితే గెలుపోటముల గురించి తాను ఆలోచించడం లేదని.. తన ఫిట్నెస్ను పెంచుకోవడంపైనే దృష్టిసారించినట్టు సైనా చెప్పింది.
'చాలా మంది నా కెరీర్ ముగుస్తుందని.. నేను కోర్టులోకి తిరిగి రానని భావిస్తున్నారు. నాకు కూడా ఏదో మూలన ఇలాంటి భావనే ఉంది. కానీ, భవిష్యతలో ఏం జరుగుతుందో చూడాలి' అని సైనా పేర్కొంది.
ఇక సుదీర్ఘ లక్ష్యాలను ఏమీ నిర్దేశించుకోవడం లేదని.. వచ్చే ఏడాది గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు నెహ్వాల్ స్పష్టం చేసింది. కాగా, గాయం కారణంగానే రియో ఒలింపిక్స్ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో గాయపడ్డ సైనా.. ముంబైలో మోకాలు శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.