న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు ఇది షాకిచ్చే వార్త. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతూ అభిమానుల మన్ననలను అందుకుంటున్న 31 ఏళ్ల లీ జోంగ్ వీ (మలేషియా) డోపింగ్ పరీక్షల్లో విఫలమైనట్లు మలేషియా మీడియా పేర్కొంది.
తమ దేశానికి చెందిన ఓ క్రీడాకారుడు నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు డోప్ పరీక్షలో రుజువైందని మలేసియా క్రీడాశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ మంగళవారం వెల్లడించారు. ఐతే తదుపరి పరీక్షలు జరుగుతున్నందున అథ్లెట్ పేరును వెల్లడించడానికి నిరాకరించాడు.

ఐతే ఈ డోపీ లీ జోంగ్ వీనేనని, ఆగస్టులో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సందర్బంగా నిర్వహించిన పరీక్షల్లో అతడు పట్టుబడ్డాడని స్ధానిక పత్రిక ఒకటి పేర్కొంది. అయితే డోప్ పరీక్షల వివరాలను వెల్లడించడం తమ నిబంధనలకు విరుద్దమంటూ, దీనిపై స్పందించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిరాకరించింది.
ఒలంపిక్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్ షిప్ ఒక్కసారి కూడా గెలవకపోయినా నిలకడగా రాణిస్తూ నంబర్ వన్గా కొనసాగుతున్న లీ జోంగ్ వీకి ఆ దేశంలో జాతీయ హీరోగా మంచి గుర్తింపు ఉంది.
ఐతే, ఇందులో ఏదో మతలబు ఉందనీ, తమ ఆటగాడికి అండగా నిలబడతామంటూ చాలామంది మలేసియావాసులు సోషల్ మీడియాలో లీ చోంగ్ వీకి మద్దతు పలికారు.