భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు షాక్ తగిలింది. మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తొలి రౌండ్లోనే సైనా ఓటమిని ఎదుర్కొంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో సైనా నెహ్వాల్ 22-20, 15-21, 10-21తో పొర్న్పవీ చొచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ఇప్పటివరకు నాలుగుసార్లు పొర్న్పవీపై గెలిచిన సైనా తొలిసారి ఓడిపోయింది.
రెండో రౌండ్లోకి సింధు, శ్రీకాంత్:
సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నిష్క్రమించినా.. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్లు అద్భుత ఆటతో రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. సింధు 22-20, 21-12తో అయ ఒహొరి (జపాన్)పై విజయం సాధించింది. శ్రీకాంత్ 21-18, 21-16తో ఇసాన్ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)పై గెలుపొందాడు. మరోవైపు హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం తొలిరౌండ్లోనే ఓటమిని చవిచూశాడు. ప్రణయ్ 21-12, 16-21, 14-21తో సితికొమ్ తమసిన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల, మహిళల సింగిల్స్లో భారత్ తరఫున సింధు, శ్రీకాంత్లు మాత్రమే టోర్నీలో ఉన్నారు. రెండో రౌండ్లో సింధు కొరియాకు చెందిన సుంగ్ జీ హ్యూన్తో, శ్రీకాంత్ థాయ్లాండ్ ఆటగాడు కొసిట్ ఫెట్ప్రదబ్తో తలపడనున్నారు.
డబుల్స్లో కూడా ఓటమే:
పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమిత్ రెడ్డి ద్వయం 16-21, 6-21తో హన్ చెంగ్కై-జౌ హొడాంగ్ (చైనా) జంట చేతిలో ఓడింది. గురువారం జరిగే మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ మలేసియాకు చెందిన తన్ కిన్ మెంగ్-లై పి జింగ్ ద్వయంతో తలపడుతుంది.