మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీనుండి భారత షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 18-21, 7-21 తేడాతో దక్షిణా కొరియాకు చెందిన సుంగ్ జీ హ్యూన్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్లో గట్టి పోటీ ఇచ్చిన సింధు.. రెండో గేమ్లో హ్యూన్ ఆట ముందు నిలవలేకపోయింది. దీంతో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా చేజార్చుకుంది.
క్వార్టర్స్లో శ్రీకాంత్ :
ఇక పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో శ్రీకాంత్ 21-11, 21-15 తేడాతో థాయ్లాండ్కు చెందిన కొసిట్ ఫెట్ప్రదబ్పై సునాయాస విజయాన్ని అందుకున్నాడు. దీంతో క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. అయితే తొలి గేమ్లో అదరగొట్టిన శ్రీకాంత్.. రెండో గేమ్లో మాత్రం కాస్త తడబడి పుంజుకున్నాడు.
మిక్స్డ్ డబుల్స్లోనూ పరాజయం:
మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడి పోరాటం ముగిసింది. సిక్కి జోడీ 15-21, 21-17, 13-21తో తాన్కియాన్-లాయ్ జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఇక ఈ టోర్నీలో భారత్ నుంచి శ్రీకాంత్ ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు భారత్ ఆశలన్నీ అతనిపైనే. ఇప్పటికే సైనా నెహ్వాల్ టోర్నీ మొదటి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.