

హైదరాబాద్: మలేసియా ఓపెన్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. సెమీస్ చేరి ఆశలు రేకెత్తించిన తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధులు నిరాశపరిచారు. ఇద్దర్లో ఒక్కరు కూడా ఫైనల్కు చేరలేకపోయారు. దీంతో భారత్ పోరు ముగిసినట్లైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత షట్లర్ పీవీ సింధు 15-21, 21-19, 11-21 తేడాతో ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్లో హైదరాబాదీ ప్లేయర్ సింధు చాలా ఇబ్బందులు పడింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో.. ఫస్ట్ గేమ్ను తాయ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక సెకండ్ గేమ్లో సింధు తన సత్తాను చూపాల్సి వచ్చింది. అతికష్టంగానే ఆమె సెకండ్ గేమ్ను గెలుచుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడవ గేమ్ ఆసక్తిని రేపింది. కానీ డిసైడింగ్ గేమ్లో సింధు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. సింధు పదేపదే పొరపాట్లు చేసింది. తైపి ప్లేయర్ అతి సునాయాసంగా గేమ్ను గెలుచుకుంది. తైపి ప్లేయర్ చాకచక్యంగా షాట్లు కొడుతూ సింధును ముప్పుతిప్పలు పెట్టింది.
దాంతో భారత్ సెమీస్లోనే తప్పుకోవాల్సి వచ్చింది. తొలి గేమ్ను కోల్పోయిన సింధు.. రెండో గేమ్లో పోరాడి గెలిచింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు చేతులెత్తేయడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇది తై జు యింగ్పై సింధుకు తొమ్మిదో ఓటమి కాగా, వరుసగా ఐదో ఓటమి.
అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 13-21, 13-21 తేడాతో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం చెందాడు. వరుస రెండు గేమ్లను మొమోటాకు సమర్పించుకున్న శ్రీకాంత్ టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్ను సునాయాసంగా చేజార్చుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్లో సైతం ఘోరంగా వైఫల్యం చెంది మ్యాచ్ను సమర్పించుకున్నాడు. ఏ ఒక్క గేమ్లోనూ కెంటొకు శ్రీకాంత్ పోటీ ఇవ్వలేకపోయాడు. సెమీస్కు భారత్ నుంచి సింధు, శ్రీకాంత్ మాత్రమే చేరుకున్నారు. ఇది మొమోటాపై శ్రీకాంత్కు ఆరో ఓటమి.