హైదరాబాద్: మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో టాప్సీడ్ సైనా 21-15, 21-14తో ఫిత్రియాని (ఇండోనేషియా)పై విజయం సాధించింది.
నలభై నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభంలోనే ప్రత్యర్థిని బ్రేక్చేస్తూ 4-0తో ముందుకెళ్లిన సైనా 11-6తో ఆధిక్యంలోకెళ్లింది. ఆ తర్వాత తేరుకున్న ఫిత్రియాని ఒకానొక దశలో 12-12తో స్కోరు సమం చేసినా, ఆ తర్వాత సైనా తన దూకుడుని పెంచి ప్రత్యర్థిని మరో మూడుపాయింట్లకే పరిమితం చేస్తూ తొలిగేమ్ను సొంతం చేసుకుంది.
ఇక రెండోగేమ్లోనూ ప్రారంభం నుంచే చెలరేగిన సైనా 4-2, 9-5, 11-6, 15-13, 19-14 ఇలా పాయింట్ల మరింతగా ముందుకెళ్లి గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఇక శనివారం జరిగే సెమీస్లో ఐదో సీడ్ యిన్ యిప్ (హాంకాంగ్)తో తలపడనుంది.
ఇప్పటివరకు 8 సార్లు వీరిద్దరు తలపడగా సైనా ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ అజయ్ జయరాం పోరాటం క్వార్టర్ఫైనల్లోనే ముగిసింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో 19వ స్ధానంలో ఉన్న జయరాం 13-21, 8-21తో ఇండోనేషియాకు చెందిన ఆరోసీడ్ ఆంథోనీ సినిసుకా గిన్టింగ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఆంథోనీ చేతిలో ఓడడం జయరాంకు ఇది వరుసగా మూడోసారి. ఇప్పటికే డబుల్స్, మిక్స్డ్ నుంచి మన షట్లర్లంతా వెనుదిరుగడంతో ఇప్పుడు భారత ఆశలన్నీ సైనా నెహ్వాల్పైనే ఉన్నాయి.