హైదరాబాద్: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ దూసుకెళ్తోంది. ప్రీ క్వార్టర్స్లో భాగంగా ఇండోనేషియా క్రీడాకారిణి దివా అయుస్తిన్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. తొలి గేమ్ను జేజార్చుకున్న సైనా రెండో గేమ్లో అనూహ్యంగా పుంజుకుంది.

దీంతో హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో 21-18తో సైనా గెలిచింది. దీంతో నిర్ణయాత్మకంగా మారిన మూడో గేమ్లో సైనాకు దివా అయుస్తిన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మూడే గేమ్లో సైనా 17-21, 21-18, 21-12తో విజయం సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బుధవారం సైనా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సైనా 21-23, 21-14, 21-18తో ఇండోనేసియాకు చెందిన హన్నా రమదినిపై విజయం సాధించి ప్రీక్వార్టర్స్ చేరింది. తొలి సెట్ను చేజార్చుకున్న సైనా, తర్వాత రెండు సెట్లలో అద్వితీయ పోరాట పటిమను కనబరిచింది.
ఇక గాయాల కారణంగా చాన్నాళ్లు ఆటకు దూరమైన కామన్వెల్త్ క్రీడల చాంపియన్ కశ్యప్ 21-19, 21-8తో చైనీస్ తైపీ ఆటగాడు చున్ వీ చెన్పై, సాయి ప్రణీత్ 21-12, 21-15తో చైనాకు చెందిన సన్ ఫెగ్జియాంగ్పై గెలిచి రెండోరౌండ్కు అర్హత సాధించారు. గతవారం హాంకాంగ్ ఓపెన్లో ఫైనల్ చేరి సంచలనం సృష్టించిన సమీర్ వర్మ నిరాశపరిచాడు.
సమీర్ వర్మ 18-21, 13-21తో మహమ్ద్ బయు (ఇండోనేషియా) చేతిలో ఓటమి పాలై తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పురుషుల డబుల్స్లో సుమిత్ రెడ్డి-మను అత్రి జోడీ 21-11, 17-21, 21-9తో హాంకాంగ్ జంట చాన్ అలన్ యున్-లీ కుయెన్ హాన్పై గెలుపొంది రెండోరౌండ్లో ప్రవేశించింది.