ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో తొలి రోజు భారత్ షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హెచ్ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మంగళవారం తలపడిన మిగిలిన షట్లర్లు సత్తాచాటి ప్రిక్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించారు.
సింగపూర్ ఓపెన్లో సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరిన గాయత్రి గోపిచంద్- ట్రీసా జాలీ జోడీ ఇండోనేషియా ఓపెన్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్లో చైనీస్ తైపీ జంట చెన్ పీ- సున్ యు 21-15, 21-11 తేడాతో గెలిచింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుస గేమ్ల్లో విజయ ఢంకా మోగించింది.

ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ విజయం సాధించాడు. జపాన్ షట్లర్ కెంటా సునెయామపై 21-12, 21-17తో గెలిచాడు. తొలి గేమ్లో సునాయాసంగా గెలిచిన లక్ష్యసేన్ రెండో గేమ్లో చెమటోడ్చాడు. అయితే ప్రత్యర్థి ప్రతిఘటించినా ఆటను రెండో గేమ్తోనే ముగించాడు.
హెచ్ఎస్ ప్రణయ్పై ప్రియాన్షు రజావత్ 21-17, 21-12 తేడాతో గెలిచాడు. భారత నంబర్ వన్ ప్రణయ్కు ఇది అనూహ్య ఓటమి. మరో భారత షట్లర్ కిరణ్ జార్జి కూడా తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చైనా ప్లేయర్ హాంగ్ యాంగ్ వెంగ్ చేతిలో 21-11, 10-21, 20-22 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్లో ఘనంగా గెలిచిన కిరణ్ రెండో గేమ్ తడబడ్డాడు.
నిర్ణయాత్మక చివరి గేమ్ హోరాహోరీగా సాగినా కిరణ్ విజయాన్ని సాధించలేకపోయాడు ఇక మిక్స్డ్ డబుల్స్లో సుమీత్రెడ్డి- సిక్కిరెడ్డి జంట గెలిచింది. తొలి రౌండ్లో అమెరికా జోడీ విన్సన్- జెనీపై 18-21, 21-16, 21-17తో గెలిచిగి ప్రిక్వార్టర్స్కు చేరింది.