ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో సతమతం అవుతున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి విఫలమైంది. కొరియన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ఆమె ఇంటి దారి పట్టింది. సింధు పోటీ పడిన చివరి ఐదు టోర్నీల్లో ఇలా తొలి రౌండ్లో ఇంటి మొఖం పట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కొరియన్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనీస్ ప్లేయర్ పై యూ పో చేతిలో సింధు ఓటమి చవిచూసింది. యూ-పో ర్యాంకు 22 కావడం గమనార్హం.
కొంత కాలంగా చాలా పేలవ ఫామ్లో ఉన్న సింధు ఈ మ్యాచ్లో 18-21తో తొలి సెట్ కోల్పోయింది. అయితే రెండో సెట్ల పుంజుకున్న ఆమె 21-10తో అద్భుతంగా ఆడి నెగ్గింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో యూ-పో అద్భుతమైన ఆటతీరు కనబర్చి సింధును 13-21 తేడాతో ఓడించింది. దీంతో మ్యాచ్ ఆమె వశమైంది. ఈ ఓటమితో సింధు ఇంటి దారి పట్టింది.

ఆమెతోపాటు మరో తెలుగు ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కూడా పేలవ ఫామ్లోనే ఉన్నాడు. శ్రీకాంత్ కూడా కొరియన్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఇంటి మొఖం పట్టాడు. పురుషుల సింగిల్స్లో విభాగంలో ప్రపంచ మాజీ నెంబర్ వన్, జపాన్ ప్లేయర్ కెంటో మొమోటాను శ్రీకాంతో ఎదుర్కొన్నాడు. తొలి సెట్లో 21-12 తేడాతో గెలిచిన శ్రీకాంత్.. ఆ తర్వాతి రెండు సెట్లలో 22-24, 17-21 తేడాతో ఓటమి చవిచూశాడు.
ఇదే టోర్నీలో ఐదో సీడ్ ప్రణయ్ ముందడుగు వేశాడు. బెల్జియం ప్లేయర్ జులెన్ కర్రాగీపై అతను 21-13, 21-17తో గెలిచాడు. అలాగే ప్రియాన్షు రాజావత్ 21-15, 21-19తో కొరియన్ ప్లేయర్ చోయ్ జి హూన్పై నెగ్గి రెండో రౌండ్లో అడుగు పెట్టాడు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కి-రోహన్ జోడీ 21-17, 21-17తో అల్విన్-అలిసా (ఫిలిప్పీన్స్) జంటపై విజయం సాధించింది.
మిగతా ప్లేయర్లలో సింగిల్స్ విభాగంలో ఆకర్షి, తస్నిమ్, మిథున్, అస్మిత.. మిక్స్డ్ డబుల్స్లో సుమిత్-అశ్విని జోడీ తొలి రౌండ్లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.