ఐపీఎల్లో హిస్టరీ రిపీట్ అయింది. గతేడాది కొత్తగా అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లు ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గతేడాది కూడా కోల్కతాను ఓడించడం వల్లనే లక్నో ప్లేఆఫ్స్ చేరుకుంది. అది కూడా థ్రిల్లింగ్ మ్యాచే.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో లక్నో జట్టు అద్భుతంగా ఆడింది. కేకేఆర్ కూడా గట్టి పోరాట పటిమ కబరిచింది. కానీ చివరకు విజయం మాత్రం లక్నోనే వరించింది. ఈ మ్యాచ్లో కేవలం 2 పరుగులతో గెలిచిన లక్నో ప్లేఆఫ్స్ చేరుకొని ఎలిమినేటర్. ఈ ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై ఇంటి దారి పట్టింది.

ఈ ఏడాది కూడా దాదాపు అలాంటి సీన్ రిపీట్ అవుతోంది. గతేడాది వలె ఈసారి కూడా కేకేఆర్పై థ్రిల్లింగ్ విక్టరీతో లక్నో ప్లేఆఫ్స్ చేరింది. అంతేకాదు, ఆదివారం జరిగే రెండు మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించకుండా అనుకున్న ఫలితమే వస్తే.. మరోసారి ఎలిమినేటర్లో ఆర్సీబీ, లక్నో తలపడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో తలపడిన లక్నో ఓడినంత పనైంది. ఈ మ్యాచ్లో చివరి వరకు క్రీజులో ఉన్న ఆ టీం యంగ్ స్టార్ రింకూ సింగ్ అద్భుతంగా పోరాడాడు. దీంతో లక్నో ఓడిపోతుందేమో అనిపించింది. అయితే చివరి రెండు బంతుల్లో కేకేఆర్ విజయానికి 12 పరుగులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో రింకూ సింగ్ భారీ సిక్సర్, ఫోర్ బాదాడు. దీంతో కేవలం ఒక్క పరుగు తేడాతో లక్నో విజయం సాధించింది.
ఇదంతా చూసిన అభిమానులు ఐపీఎల్ 2023 స్క్రిప్ట్ కూడా గతేడాదిలాగే వెళ్తోందని ఎద్దేవా చేస్తున్నారు. దానికితోడు లక్నో, ఆర్సీబీ చివరగా తలపడినప్పుడు ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆఫ్ఘన్ పేసర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య మొదలైన ఈ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య పెద్ద వివాదానికి దారితీాసిన సంగతి తెలిసిందే. అలాంటి జట్లు మళ్లీ ఎలిమినేటర్లో కలిసే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.