
హైదరాబాద్: సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గుజ్జుల సుధాకర్ రెడ్డి గుండె పోటుతో మృతి చెందారు. ప్రస్తుతం పోలెండ్లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ సీనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత జట్టుకు సుధాకర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో పోటీపడ్డ అనంతరం సుధాకర్ రెడ్డి హోటల్ గదికి చేరుకున్నారు. అనంతరం సుధాకర్ రెడ్డికి గుండెపోటు రావడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి చెరుకూరి రఘు కిరణ్లు తెలిపారు.
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, అతడి అన్న నందగోపాల్, సాత్విక్ సాయిరాజ్, రుత్వికా శివానీకి సుధాకర్ కోచ్గా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం బ్యాడ్మింటన్ అకాడమీకి కోచ్గా పనిచేసిన సుధాకర్ రెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాత నెల్లూరు బ్యాడ్మింటన్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ, కాకినాడ అకాడమీల్లో ఎంతో మందిని బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా ఆయన తీర్చిదిద్దారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లో నివాసం ఉంటున్న సుధాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు స్పోర్ట్స్ అథారిటీలో బ్యాడ్మింటన్ కోచ్గా పనిచేస్తున్నారు.
సుధాకర్ రెడ్డి స్వస్థలం గుంటూరు. షట్లర్గా కెరీర్ ప్రారంభించిన సుధాకర్ రెండు సార్లు ఆంధ్ర చాంపియన్గా నిలిచారు. మాస్టర్స్ నేషనల్స్లో పురుషుల డబుల్స్లో రజతం, మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకాలను సాధించారు. సుధాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు కోచ్లు, క్రీడాభిమానులు, సహచర ఆటగాళ్లు సంతాపం తెలిపారు. సుధాకర్ రెడ్డి మృతి బ్యాడ్మింటన్కు తీరని లోటని ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు రాయపాటి రంగారావు పేర్కొన్నారు.