
బాసెల్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ విజయం సాధించి రెండో రౌండుకు చేరారు. మహిళల డబుల్స్లోనూ మంచి ఆరంభమే దక్కింది.
గాయం నుంచి కోలుకున్న ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్కు తొలి రౌండ్లో ప్రత్యర్థి నుయెన్ (ఐర్లాండ్) నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. శ్రీకాంత్ 17-21, 21-16, 21-6తో విజయం సాధించాడు. 66 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్ 14-7తో ముందంజలో ఉన్న సమయంలో పదేపదే తప్పిదాలు చేసి గేమ్ను 17-21తో కోల్పోయాడు. ఇక రెండో గేమ్ ఆరంభంలో 3-6తో వెనుకబడిన శ్రీకాంత్.. ఆ తర్వాత పుంజుకుని 21-16తో గేమ్ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చెలరేగిన శ్రీకాంత్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-6 తేడాతో మ్యాచును కైవసం చేసుకున్నాడు. రెండో రౌండ్లో మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయిల్)తో శ్రీకాంత్ తలపడనున్నాడు.
19వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 21-17, 21-16తో ఆంటోనీ హోసూ (కెనడా)ను వరుస గేమ్ల్లో మట్టికరిపించాడు. 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో తొలిగేమ్ ప్రారంభంలో పోరు హోరాహోరీగా సాగింది. 8-7 ఉన్న దశలో ప్రణీత్ రెచ్చిపోయి వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించాడు. మరోవైపు ఆంటోనీ కూడా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యాన్ని తగ్గించాడు. చివరికి ప్రణీత్ 21-17 తేడాతో తొలిగేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లోనూ ఇరువురు ఆటగాళ్లు ఆధిక్యం కోసం శ్రమించారు. 11-9తో ఆధిక్యం దక్కించుకున్న ప్రణీత్.. అదే ఊపులో 21-16తో గేమ్తో పాటు మ్యాచ్ను గెలిచాడు.
మరో మ్యాచ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ 17-21, 21-10, 21-11 తేడాతో 93వ ర్యాంకర్ ఇటూ హీనో (ఫిన్లాండ్)పై నెగ్గాడు. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రణయ్ తొలి గేమ్ కోల్పోయినా.. అనంతరం చెలరేగి రెండు గేమ్లను గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. రెండో రౌండ్లో లిన్డాన్ (చైనా)తో ప్రణయ్ తలపడనున్నాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన-పూర్విష రామ్ 21-10, 21-18తో డయానా సోటో-అలెగ్జాండ్ర సోటోమేయర్ (గాటెమాల)పై గెలుపొందారు.