హైదరాబాద్: ఇటీవలే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో సత్తాచాటిన క్రీడాకారులకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణ పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనాకు రూ.50లక్షలు, మరో షట్లర్ సిక్కీరెడ్డికి రూ.30 లక్షలు, రుత్వికా శివానీకి రూ.20లక్షలు, బాక్సర్ ముహమ్మద్ హుస్సాముద్దీన్ కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాల్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
జీవో ప్రకారం వచ్చే నగదు ప్రోత్సాహకాలకు ఈ నజరానాలు అదనమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, క్రీడల మంత్రి పద్మారావు చేతుల మీదుగా వీరికి నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఇదే కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు నగదు బహుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది.
సైనా నెహ్వాల్తో పాటు పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ స్పోర్ట్సు అథారిటీ ప్రకటించిన నగదు బహుమతుల జాబితాలో సింధు పేరు లేకపోవడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, పెరిగి ఇక్కడే నివాసముంటున్న షట్లర్ పీవీ సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టరు పోస్టు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం నిర్వహిస్తోన్న పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, సింధు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం స్వీకరించడానికి ముందు 2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు పతకం గెలిచినప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూ.5కోట్ల నగదు బహుమతితోపాటు హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.