
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడంపై మాజీ డబుల్స్ షట్లర్ జ్వాలా గుత్తా ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధం పర్ధం లేని పార్టీలో చేరావంటూ సైనా నెహ్వాల్ను ఉద్దేశించి వ్యంగ్యంగా ట్విట్టర్లో ట్వీట్ చేసింది. గుత్తా జ్వాలా తన ట్విట్టర్లో "ఏ లక్ష్యం లేకుండానే ఆట మొదలుపెట్టడం.. ఇప్పుడు ఏ కారణం లేకుండానే పార్టీలో చేరడం... ఇలాంటి వారి గురించి తొలిసారిగా వింటున్నా" అని ట్వీట్ చేసింది. సైనా నెహ్వాల్ బీజేపీలో చేరిన కొద్దిగంటలకే ఆమె ఈ ట్వీట్ చేయడం విశేషం.
దీంతో జ్వాలా గుత్తా ట్వీట్పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సైనా నెహ్వాల్ బీజేపీలో చేరడాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. జ్వాలాకు సైనా అంటే అసూయ అని నెటిజన్లు మండిపడుతున్నారు. సైనాకు తనకు ఇష్ట ప్రకారమే బీజేపీలో చేరిందని.... ఆమె కూడా కావాలంటే తనకు ఇష్టమైన పార్టీలో చేరొచ్చని నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.
భావోద్వేగాల్లో ఒకటైన ఈర్ష్యను వ్యక్తపరచకుండా ఉండటం చాలా కష్టమని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... బీజేపీలో చేరడం సైనా వ్యక్తిగత ఎంపిక అని.. ఎందుకు రాద్ధాంతం చేస్తున్నావని.. ట్వీట్ డిలీట్ చేయాలని గుత్తా జ్వాలకు మరో నెటిజన్ సలహా ఇచ్చింది.
కాగా, బుధవారం ఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సైనా నెహ్వాల్ కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. హర్యానా రాష్ట్రంలో జన్మించిన సైనా దేశంలోనే విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు.
పార్టీలో చేరిక తర్వాత బీజేపీ కార్యాలయంలో సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ఎన్నో మంచిపనులు చేస్తోన్న బీజేపీ గొప్ప పార్టీఅని, ఆ కుటుంబంలో సభ్యురాలినైననందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీలాంటి విశిష్టవ్యక్తితో కలిసి పనిచేసే అవకాశం లభించడం వరంలాంటిదన్నారు.
దేశానికి మరింత మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ చెప్పారు. సైనా నెహ్వాల్ గతంలో అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా.. ఇక నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రవేయనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ తరపున సైనా స్టార్ కాంపైనర్గా చేయనున్నారు. 29 ఏళ్ల సైనా నెహ్వాల్ 20 ఇంటర్నేషనల్ టైటిల్స్ను గెలుచుకున్నారు. అద్భుత ఆటతో సైనా నెహ్వాల్ 2009లో ప్రపంచ నంబర్ 2, 2015 సంవత్సరంలో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి సాధించారు. ప్రస్తుతం సైనా తొమ్మిది ర్యాంకులో కొనసాగుతున్నారు.
హర్యానాలోని హిస్సార్లో మార్చి 17, 1990న సైనా నెహ్వాల్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాధించిన వారే. హైదరాబాద్లోని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా.. విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచారు. 2015లో ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంకింగ్ మహిళా షట్లర్గా రికార్డు సృష్టించారు.
తోటి క్రీడాకారుడైన పారుపల్లి కశ్యప్ను సైనా వివాహం చేసుకున్నారు. ఇప్పటికే భారత రాజకీయాల్లోకి పలువురు క్రీడాకారులు వచ్చిన విషయం తెలిసిందే. క్రికెటర్ గౌతం గంభీర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్, రెజ్లర్ బాబిత ఫోగట్ గతేడాది భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం విదితమే.