హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తూ బుధవారం వార్తల్లోకెక్కారు. కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ డబుల్స్లో అశ్విని పొన్నప్పతో కలసి టైటిల్ కైవసం చేసుకున్న జ్వాలా గుత్తా మంగళవారం నగరానికి చేరుకున్నారు.
బుధవారం ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడుతూ కెనడా ఓపెన్ టైటిల్ను గెలుపొందడం సంతోషంగా ఉందని అన్నారు. "నేను నచ్చలేదో? లేక నా మొహం నచ్చలేదో? పనిగట్టుకుని నాపై రాజకీయాలు చేస్తున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ అకాడమీకి నిధులిస్తూ వాటిని ఎంకరేజ్ చేయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు.

జ్వాలా గుత్తా చెప్పకనే చెపుతూ పుల్లెల గోపీచంద్ అకాడమీని ఉద్దేశించి విమర్శలు చేశారు. బ్యాడ్మింటన్లో ఎంతో రాణిస్తున్నప్పటికీ, ఒలింపక్ టాప్ స్కీంకు తన పేరును ప్రతిపాదించకపోవడం తనకు ఎంతో బాధను కలిగించిందని అన్నారు. తాను భారత్ కోసం టైటిల్స్ గెలవడం కొంత మందికి సంతోషం లేదనుకుంటా అని అన్నారు.
రెండు రోజులు క్రితం జరిగిన 'కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ' పైనల్లో తన భాగస్వామి పొన్నప్పతో కలిసి సత్తా చాటిన సంగతి తెలిసిందే. కేవలం 35 నిమిషాల్లోనే తన ప్రత్యర్ధులను మట్టికరిపించి టైటిల్ను కైవసం చేసుకుంది.