న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్), షట్లర్ గుత్తా జ్వాలల మధ్య వివాదం సమసిపోయింది. జ్వాలాపై అభియోగాలను బాయ్ ఉపసంహరించుకుంది. గత వారం జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ సందర్భంగా బాయ్ అధ్యక్షులు అఖిలేష్ గుప్తాతో జ్వాలా మాట్లాడిన తర్వాత ఈ వివాదానికి తెర పడింది.
బాయ్ నిర్ణయం పట్ట తాను సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తు టోర్నీల్లోను జాతీయ జట్టు తరఫున ఆడతానని, దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని గుత్తా జ్వాలా అన్నారు.

కాగా, బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా ఢిల్లీ స్మాషర్స్ను మ్యాచ్ను రద్దు చేసుకునేలా ప్రోత్సహించిందన్న ఆరోపణలుపై విచారణ చేపట్టిన బాయ్ క్రమశిక్షణ కమిటీ, జ్వాలాపై జీవిత కాలం నిషేధాన్ని సిఫార్సు చేసింది.
జ్వాలా బేషరతు క్షమాపణ చెప్పే వరకు ఆమెపై జీవితకాల నిషేధం లేదంటే దేశంలో ఆరేళ్ల పాటు బ్యాడ్మింటన్ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. జ్వాలా అభ్యంతరాలు వినేందుకు ఓ ప్యానల్ను వేసింది. బాయ్ నిర్ణయంపై జ్వాలా కోర్టుకు వెళ్లడంతో వివాదం ముదిరింది. ఇప్పుడు ఆ వివాదం ముగిసింది.