
హైదరాబాద్: భారత బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆరోపించారు. భారత మహిళల బ్యాడ్మింటన్లో డబుల్స్ క్రీడాకారిణి గుత్తా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడించడం గుత్తా స్టయిల్. ఈ కారణంగానే చాలాసార్లు వార్తల్లో కూడా నిలిచారు.
కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుత్తా జ్వాల అన్నారు. 'నా కెరీర్లో ఎదుర్కొన్న వేధింపులకు కచ్చితంగా పుల్లెల గోపీచందే కారణంగా చెబుతాను. నేనేదైనా బహిరంగంగానే మాట్లాడతా. దీనికి తగిన మూల్యం కూడా చెల్లించా. బ్యాడ్మింటన్లో నా సత్తా ఏమిటో ఆయనకు తెలుసు. నాకు మద్దతుగా ఉంటాడని భావించా. కానీ.. మిక్స్డ్లో నాతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆడేవాడు' అని గుత్తా ఫైర్ అయ్యారు.
'ఒకప్పుడు బ్యాడ్మింటన్లో టాప్ ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదు. మీరు ఓసారి గమనించినట్లయితే.. గోపీ ఆడేటప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఆటగాళ్ళు ఉన్నారు. కానీ గత 10-12 సంవత్సరాలుగా అంతా హైదరాబాద్లోని అతడి అకాడమీ నుంచి మాత్రమే వస్తున్నారు. అలా అయితేనే వారికి గుర్తింపు లభిస్తుంది. భారత్కు పతకం వస్తే.. అది గోపీచంద్ శిక్షణ వల్లే వచ్చినట్టు. రాకపోతే మాత్రం తప్పు వ్యవస్థ మీదికి నెట్టేస్తున్నారు' అని గుత్తా జ్వాల ఆరోపించారు. 2004లో గోపీ, గుత్తా కలిసి మిక్స్డ్ డబుల్స్లో జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలుచుకున్నారు. అనంతరం ఇరువురి మధ్య దూరం పెరిగింది.
అంతర్గత రాజకీయాల కారణంగా విదేశీ కోచ్లు తమ పదవీకాలం పూర్తి చేయకుండానే వెళ్లిపోతున్నారు అని గుత్తా జ్వాల ఆరోపించారు. 2017లో కిడాంబి శ్రీకాంత్ మరియు ఇతర పురుషుల షట్లర్ల ఆటక మెరుగుదలకు సహాయం చేసిన ఇండోనేషియా కోచ్ ముల్యో హండోయో ఎటువంటి కారణం చెప్పకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోయారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో పీవీ సింధు బంగారు పతకం సాధించడం వెనుక ఉన్న దక్షిణ కొరియా కోచ్ కిమ్ జీ హ్యూన్ కూడా వెళ్లిపోయారు. విదేశీ కోచ్లు ఎందుకు ఉండడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. జాత్యహంకారంపై కూడా జ్వాల స్పందిస్తూ... వాక్ స్వాతంత్య్రం ఉందని చెప్పబడిన దేశంలో పెరిగాను. ప్రజలకు ఒక పాఠం నేర్పించడం నా కర్తవ్యం అని అన్నారు.