న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. తనపై వచ్చిన విమర్శలపై ఆయన బుధవారం మాట్లాడుతూ.. జ్వాల తనను ఎందుకు లక్ష్యంగా చేసుకుందో తెలియడం లేదన్నారు.
టాప్ ప్రోగ్రామ్లో జ్వాల, అశ్విని పేర్లు చేర్పించేందుకు ఎంతో కృషి చేశానని తెలిపారు. ఇందుకోసం స్పోర్ట్స్ అథారిటీ డీజీతో కూడా మాట్లాడానని గోపీచంద్ చెప్పారు. జ్వాల వ్యాఖ్యలను సాయ్, బాయ్, టాప్ ఖండించడం ద్వారా తన నిజాయితీని గుర్తించినట్లైందని గోపీచంద్ వ్యాఖ్యానించారు.
తిరిగి విమర్శలు చేయడం లేదని అలుసుగా తీసుకోవద్దని గోపీచంద్ హెచ్చరించారు. జ్వాల తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. జ్వాల, అశ్వినీకి పూర్తి సౌకర్యాలు అందజేశామని, అందువల్లే వారు ఇప్పుడున్న స్థానానికి చేరుకున్నారని గోపీచంద్ స్పష్టం చేశారు.

మెడల్ గెలుచుకోగానే స్పార్ట్స్ అథారిటీ అధికారులు స్వాగతం పలికారని, వారిని అభినందిస్తూ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ డిన్నర్లో తాను కూడా పాల్గొన్నట్లు గుర్తుచేశారు. డిన్నర్లో పాల్గొంటే అభినందించినట్టు కాదా? అని గోపీ ప్రశ్నించారు.
అయినదానికీ కానిదానికీ నిందించడం సరికాదని జ్వాలకు హితవు పలికారు. తనపని ఏదో తాను చేసుకుపోతానని, అది అందరికీ తెలుసని చెప్పారు. వివాదాలు తనకు ఇష్టం ఉండదని గోపీచంద్ స్పష్టం చేశారు. జ్వాల విమర్శించింది కదా అని తాను విమర్శలు చేయలేనని తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్), భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్), కేంద్ర ప్రభుత్వం నుంచి జ్వాల, పొన్నప్పల జోడీకి అన్ని విధాలా సహాయం అందుతోందని స్పష్టం చేశారు. అయినా తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు.