
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, తమిళ నటుడు విష్ణు విశాల్ గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరికాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. ఈరోజు జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జ్వాలా గుత్తా ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు.
మెహందీ వేడుకలకు జ్వాలా గుత్తా పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా.. బ్లాక్ కుర్తాలో విష్ణు విశాల్ సందడి చేశారు. ఇక అంతకుముందు జరిగిన హల్ది వేడుకలో కూడా జ్వాలా మురిసిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెపై నీరు, పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం జ్వాల-విశాల్ల మెహందీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విష్ణు విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాల గుత్తాను అతడు కలిశాడు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరు ఆపై నిచ్చితార్ధం కూడా చేరుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ జంటకు ఉండడంతో అన్ని సజావుగా జరుగుతున్నాయి. విశాల్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసి పెళ్లికి సిద్దమవగా.. జ్వాలా కూడా అకాడమీ పనులను పక్కకు పెట్టారు.
జ్వాల గుత్తా ఫుల్ ఫామ్లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్తో 2011లో విష్ణు విశాల్ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్యన్ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు.