టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాడు సాయి ప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ సూపర్-750 టోర్నమెంట్లో దూసుకెళుతున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23 వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 21-12, 21-15 తేడాతో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై సునాయాసంగా గెలిచి సెమీ ఫైనల్కు చేరుకున్నాడు. ప్రణీత్ కేవలం 36 నిమిష్లాలోనే మ్యాచ్ ముగించాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ప్రణీత్ జపాన్ ఓపెన్లో సెమీ ఫైనల్కు చేరుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో సెమీస్కు చేరిన తొలి భారత ఆటగాడిగా ప్రణీత్ గుర్తింపు సాధించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. సెమీస్లో ప్రణీత్ టాప్ సీడ్ కెంటో మోమోటాను ఎదుర్కొనే అవకాశం ఉంది.
తొలి గేమ్ను సునాయాసంగా గెలిచిన ప్రణీత్.. అదే జోరును రెండో గేమ్లో కూడా కొనసాగించాడు. అయితే ఓ సమయంలో ప్రత్యర్ధి సుగియార్తో నుంచి ప్రతి ఘటన ఎదురైనా.. ప్రణీత్ ఎక్కడా అవకాశం ఇవ్వకుండా గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. కేవలం 36 నిమిష్లాలోనే మ్యాచ్ ముగిసింది. ఈ ఏడాది ప్రణీత్కు ఇది రెండో సెమీ ఫైనల్. అంతకుముందు ప్రణీత్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్ ఫైనల్కు చేరుకున్నాడు. ఇక ఇండియా ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ నిష్క్రమణ అనంతరం ఫామ్ కోల్పోయాడు.
గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-13, 21-16 తేడాతో కాంటా సునెయామ (జపాన్)పై గెలిచి ముందడుగేసాడు. ప్రణీత్ వరుస సెట్లలో విజయం సాధించాడు. కేవలం 45 నిమిషాల్లో మ్యాచ్ ముగించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 11-21, 21-10, 21-13 తేడాతో అయా ఒహోరి (జపాన్)పై విజయం సాధించి క్వార్టర్స్కు చేరుకుంది. ఈ రోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.