టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్లో భారత ఆటగాడు భమిడిపాటి సాయి ప్రణీత్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 23వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-17, 21-13తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంట నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో కీలకదశలో విజృంభించిన ప్రణీత్.. విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరాడు. ఇక గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన కాంటా సునెయామతో సాయిప్రణీత్ ఆడతాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
మిక్స్డ్ డబుల్స్లో విభాగంలో సాత్విక్ సాయిరాజు, అశ్విని పొన్నప్ప జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలి రౌండ్లో సాత్విక్-అశ్విని ద్వయం 21-14, 21-19తో మార్విన్ సీడెల్-లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్రెడ్డి- మను అత్రి 12-21, 16-21తో గో ఫెయ్- నూర్ ఐజుద్దీన్ (మలేసియా) చేతిలో పరాజయం పాలైంది.
బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హాన్ యుయె (చైనా)తో హైదరాబాద్ స్టార్ పీవీ సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్తో కిడాంబి శ్రీకాంత్, ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని సైనా టోర్నీ నుంచి వైదొలిగింది.
మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో జెంగ్ సి వె-హువాంగ్ యా కియోంగ్ (చైనా)లతో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా, మహిళల డబుల్స్ తొలి రౌండ్లో కిమ్ సో యోంగ్-కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా)లతో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప, పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మార్కస్ ఇలిస్-క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్)లతో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తలపడనున్నారు.