
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21-9, 21-17 తేడాతో అన్సీడెడ్ క్రీడాకారిణి హాన్ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే రెండో గేమ్లో సింధుకు కాస్త పోటీ ఎదురైంది. ఈరోజు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అయా ఒహోరి (జపాన్)తో సింధు తలపడనుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సమీర్ వర్మ (భారత్) 17-21, 12-21తో ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి 21-16, 21-17 తేడాతో ఇంగ్లండ్ ద్వయం మార్కస్ ఇల్లిస్, క్రిస్ లాంగ్రిడ్జ్పై విజయం సాధించింది.
మహిళల డబుల్స్లో అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ 16-21, 14-21 తేడాతో కొరియాకు చెందిన సో యోంగ్ కిమ్, హీ యాంగ్ కాంగ్ ద్వయం చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక మిక్స్డ్ డబుల్స్లో ప్రణయ్ చోప్రా, సిక్కిరెడ్డి జంట 11-21, 14-21 తేడాతో టాప్ సీడ్ చైనీస్ జోడీ జెంగ్ సీ వీ, హుయాంగ్ వీ క్వింగ్ చేతిలో పరాజయం పాలైంది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ భారత్కే చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ను 13-21, 21-11, 22-20 తేడాతో ఓడించాడు. మ్యాచ్ ప్రారంభంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తొలి గేమ్ను 21-13 తేడాతో గెలుపొందిన శ్రీకాంత్.. ఆ తర్వాత తడబడి మ్యాచ్ కోల్పోయాడు. రెండో రౌండ్లో డెన్మార్క్ ఆటగాడు రాస్మస్ జెమ్కేతో ప్రణయ్ తలపడనున్నాడు.