
హైదరాబాద్: 24 గంటలు గడవకముందే భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తాను అనుకున్నది సాధించింది. సైనా లేఖకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) తలొగ్గింది. తన తండ్రిని కామన్వెల్త్ గేమ్స్ క్రీడాగ్రామంలోకి అనుమతించేందుకు ఐవోఏ అంగీకరించింది.
అసలేం జరిగింది?
తనతో పాటు గోల్డ్ కోస్ట్ వెళ్లిన తన తండ్రి హర్వీర్ సింగ్ని క్రీడా గ్రామంలోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్లో వరుస ట్వీట్లతో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు కామన్వెల్త్ క్రీడాగ్రామంలోకి తన తండ్రిని అనుమతించకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటానని సైనా హెచ్చరించింది.
ఈ మేరకు ఆమె భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహతాకు లేఖ రాశారు. తన తండ్రికి అక్రిడేషన్ కల్పించాలని సైనా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు స్పందించిన ఐఓఏ సైనా తండ్రిని కామన్వెల్త్ గేమ్స్కు అనుమతినిస్తున్నట్లు తెలిపింది. అతను సైనా మ్యాచ్లను చూడవచ్చని కూడా పేర్కొంది.
తన తండ్రి మద్దతు లేకుండా తాను ఆడలేనని, అందుకే ఆయనను అన్ని మ్యాచ్లకు తీసుకెళ్తుంటానని తెలిపింది. తొలుత టీమ్ అధికారిగా తన తండ్రిని ధ్రువీకరించడంతో ఆయన ఖర్చులన్నీ భరించి ఇక్కడికి తీసుకొచ్చానని, తీరా ఇక్కడికి వచ్చాక.. తన తండ్రి పేరును టీమ్ అధికారిక జాబితా నుంచి తొలగించారని సైనా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా బుధవారం నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం పదకొండు రోజుల పాటు జరిగే ఈ క్రీడలు క్రీడాభిమానులకు ఎంతో వినోదాన్ని పంచనున్నాయి. గత మూడు ఎడిషన్లలో భారత్కు మొత్తం 215 పతకాలు సాధించింది. గతేడాది గ్లాస్గో వేదికగా జరిగిన గేమ్స్లో 64 పతకాలు సాధించింది.
అయితే ఇందులో 15 స్వర్ణాలు ఉండటం విశేషం. గోల్డ్ కోస్ట్ గేమ్స్లో 225 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య పెరగాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి కచ్చితంగా పతకం పట్టుకొచ్చే వారిలో మేరీకోమ్, సైనా నెహ్వాల్, సంజితా చాను, మొహులీ ఘోష్, వికాస్ క్రిషన్ తదితరులు ఉన్నారు.