హైదరాబాద్: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పోటీపడ్డ నాలుగోసీడ్ శ్రీకాంత్ 21-12, 14-21, 15-21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా చేతిలో ఓడి తొలిరౌండ్లోనే నిష్క్రమించాడు.
శ్రీకాంత్పై గెలవడం మొమొటకిది ఏడోసారి. గతవారం మలేసియా ఓపెన్ సెమీస్లో మొమోటా చేతిలో ఓటమిపాలైన శ్రీకాంత్... తాజాగా ఇండోనేసియా ఓపెన్లోనూ నిరాశపరిచాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-15, 19-21, 21-13తో చొచువాంగ్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది.
మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధూ ఒహొరిపై వరుసగా రెండు గేమ్స్ గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్లో సింధు చైనాకు చెందిన బింగ్జియావోతో తలపడనుంది. ఇదిలా ఉంటే గురువారం సింధు పుట్టినరోజు. బర్త్డే రోజున సింధు విజయం సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లడం మరో విశేషం.
మరో భారత అమ్మాయి వైష్ణవి రెడ్డి 12-21, 10-21తో లిన్ హాజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. కాగా, మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా- సిక్కిరెడ్డి 12-21, 14-21తో జెంగ్- హువాంగ్ (చైనా) చేతిలో ఓడారు. ఇక, పురుషుల డబుల్స్లో సుమిత్ రెడ్డి-మను అత్రి జోడీ 21-15, 15-21, 17-21తో చైనా జోడీ చెంగ్-జాంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.