హైదరాబాద్: జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేసియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న పీవీ సింధు గురువారం జపాన్ షట్లర్ ఆయా ఓహ్రితో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో 21-17, 21-14 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్కు చేరింది.
అద్భుతమైన ఫామ్లో ఉన్న పీవీ సింధుకి జపాన్ షట్లర్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మొత్తం 36 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధూ ఒహొరిపై వరుసగా రెండు గేమ్స్ గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇలా ఓ జపాన్ షట్లరని సింధు వరుసగా ఓడించడం ఇది ఐదోసారి.
క్వార్టర్స్లో సింధు.. చైనాకు చెందిన బింగ్జియావోతో తలపడనుంది. తన పుట్టిన రోజునాడు సింధు విజయం సాధించి క్వార్టర్స్కు దూసుకెళ్లడం విశేషం. ఇటీవల ముగిసిన మలేసియా ఓపెన్లోనూ ఈ భారత షట్లర్ సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లిన విషయం తెలిసిందే.
బుధవారం జరిగిన తొలి రౌండ్లో థాయ్లాండ్కి చెందిన చొచువాంగ్పై పీవీ సింధు 21-15, 19-21, 21-13 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కొన్ని తప్పిదాలు చేసిన సింధు.. ప్రీక్వార్టర్స్లో మాత్రం ఎలాంటి తప్పిదాలకు పాల్పడకుండా జపాన్ షట్లర్ను మట్టికరిపించింది.