దాదాపు నెల రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. మరో ఇద్దరు సింగిల్స్ షట్లర్లు సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే వెనుదిరిగి నిరాశ పరిచారు.
పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్న ఇంజామామ్
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 11-21, 21-15, 21-15తో జపాన్కు చెందిన అయా ఒహొరిపై విజయం సాధించింది. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం. సింధు తర్వాతి రౌండ్లో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-14, 21-13తో జపాన్ ఆటగాడు కెంటా నిషిమొటోను అలవోకగా ఓడించాడు. ప్రీక్వార్టర్ ఫైనల్లో హాం కాంగ్కు చెందిన కా లాంగ్ ఆగ్నస్ను శ్రీకాంత్ ఢీకొంటాడు.
సాయి ప్రణీత్ 15-21, 21-13, 10-21తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడగా.. ప్రణయ్ 21-19, 18-21, 20-22తో చైనా స్టార్ షట్లర్ రెండో సీడ్ షి యుకీ చేతిలో పోరాడి ఓడాడు. ఇక మిక్స్డ్ డబుల్స్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-అశ్వినీ పొన్నప్ప 13-21, 11-21తో ఇండోనేసియా జోడి విన్నీ ఒక్తావినా-టాన్టోవీ అహ్మద్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మను అత్రి జోడీ 11-21, 17-21తో లియావో మిన్ చున్-సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యారు.
గురువారం జరిగే మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జెంగ్ సి వె-హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మార్కస్ గిడియోన్-కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి (భారత్) జంట తలపడతాయి.