
మంగళవారం నుండి ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఈ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్లు బరిలోకి దిగుతున్నారు. స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్లపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. గాయంతో బాధపడుతున్న మరో టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈ టోర్నీకి దూరంగా ఉంది.
నెల రోజుల బ్రేక్ తర్వాత బరిలోకి దిగుతున్న సింధు ఇండోనేసియా ఓపెన్ టైటిల్పై గురిపెట్టింది. గత డిసెంబరులో వరల్డ్టూర్ ఫైనల్లో విజేతగా నిలిచిన సింధు.. తాజా సీజన్లో ఇంతవరకు బోణీ కొట్టలేకపోయింది. దీంతో ఈ టోర్నీలో టైటిల్ విజేతగా నిలవాలని చూస్తోంది. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్లో అయా ఒహోరి (జపాన్)తో సింధు తలపడనుంది. సింధు పార్శ్వంలోనే ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్), రెండో సీడ్ చెన్ యుఫె (చైనా) ఉన్నారు. దీంతో ఆదిలోనే సింధుకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
మోకాలి గాయం నుంచి కోలుకున్న శ్రీకాంత్ ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగనున్నాడు. శ్రీకాంత్ తొలి రౌండ్లో కెంటో నిషిమోటో (జపాన్)తో పోటీ పడనున్నాడు. వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్.. షి యుకి (చైనా)తో ప్రణయ్ తలపడతారు. డబుల్స్లో సాత్విక సాయిరాజ్, అశ్వినీ పొన్నప్ప.. మిక్స్డ్లో సిక్కిరెడ్డి జోడీలు బరిలో నిలవనున్నాయి. గాయాల నుండి కోలుకున్న మన ఆటగాళ్లు మెరుగైన ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉంది.