
హైదరాబాద్: ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్కు దూసుకెళ్లింది. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీస్లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే పీవీ సింధు చిత్తుగా ఓడించింది. తద్వారా భారత్కు కనీసం రజతం ఖాయం చేసింది. క్వార్టర్స్లో సింధూ తన చిరకాల ప్రత్యర్థి నొజొమి ఒకుహరను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మొదటి గేమ్ను దూకుడుగా ఆరంభించిన చైనా షట్లర్ చెన్ యుఫీ 4-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, వెంటనే తేరుకున్న సింధు వరుసగా పాయింట్లు సాధించి స్కోరును సమం చేయడంతో పాటు తన అనుభవాన్ని ఉపయోగించి తొలి సెట్ను 21-19తో కైవసం చేసుకుంది. ఇక, రెండో గేమ్లో తన ప్రత్యర్థికి పీవీ సింధు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా 11 పాయింట్లు సాధించింది.
పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 21-10తో గేమ్తో పాటు మ్యాచ్ను సైతం చేజిక్కించుకుంది. ప్రస్తుతం ప్రపంచ మూడో ర్యాంకు క్రీడాకారిణి చెన్యూఫీ ఈ ఏడాది ఆస్ట్రేలియా, స్విస్, ఆల్ఇంగ్లాండ్ కైవసం చేసుకొని జోరుమీదుంది. ఆమెపై విజయం ఫైనల్లో సింధుకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఫైనల్లో ఆదివారం జపాన్ స్టార్ క్రీడాకారిణి యమగూచితో సింధూ తలపడనుంది. ఆమెపై సింధుకు మెరుగైన రికార్డు ఉంది.