భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరో షాక్ తగిలింది. ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నీలోనూ ఆమెకు నిరాశే ఎదురైంది. ఇండియా ఓపెన్-750 టోర్నీ క్వార్టర్ ఫైనల్లో ఇంటి ముఖం పట్టిన సింధుకు.. ఇప్పుడు ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలోనూ చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. తాజాగా జరిగిన ఈ మ్యాచ్లో 12వ ర్యాంకర్ అయిన పీవీ సింధు 20-22, 12-21 తేడాతో 32వ ర్యాంకర్ తిన్ నుయెన్ (వియత్నాం)పై ఓడిపోయింది.
దీంతో గతంలో రెండు సార్లు సింధుతో పోటీ పడి (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్క్టిక్ ఓపెన్) ఓడిపోయిన తిన్ నుయెన్.. మూడో ప్రయత్నంలో ఎట్టకేలకు గెలిచింది. 37 నిమిషాల పాటు ఈ పోరు సాగింది.

లక్ష్యసేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ఎంటర్ అయ్యాడు. అతడు ఆడిన తొలి రౌండ్ ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్ లో లక్ష్య సేన్ వరుస గేమ్ల్లో 21-9, 21-14 తేడాతో తకుమ ఒబాయిషి (జపాన్)ను ఓడించాడు. ఆయుష్ శెట్టి 19-21, 19-21 తేడాతో షై యుకి (చైనా)పై, కిరణ్ జార్జ్ 12-21, 10-21తేడాతో జిన్ జియోన్ (కొరియా)పై ఓడిపోయారు.
మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది. తొలి రౌండ్ లో ధ్రువ్- తనీషా ద్వయం 21-18, 21-14 తేడాతో అద్నాన్ మౌలానా- ఇందా కాహ్యా (ఇండోనేసియా) జోడీకి పరాజయం రుచి చూపించింది. రోహన్ కపూర్- రుత్విక శివాని ద్వయం 9-21, 13-21 తేడాతో గ్రెగొరీ మేర్స్ - జెనీ మేర్స్ ద్వయం చేతిలో ఓడిపోయింది.