
జకర్తా: ఇండోనేసియా మాస్టర్ సూపర్ - 500 టోర్నీ తొలి రౌండ్ నుండే భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మలు నిష్క్రమించారు. డిఫెండింగ్ ఛాంపియన్ సైనా నెహ్వాల్కు తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్లో జపాన్ ప్లేయర్ సయాక టకహషితో జరిగిన పోరులో సైనా 19-21, 13-21, 5-21 తేడాతో ఓటమి చవిచూసింది. గతవారం మలేసియా మాస్టర్స్లోనూ సైనా క్వార్టర్స్ దశలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే.
పురుషుల సింగిల్స్లో ప్రపంచ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్కు చుక్కెదురైంది. ప్రపంచ 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-18, 12-21, 14-21 తేడాతో స్థానిక ఆటగాడు షేసర్ హిరెన్ రుస్తవిటో చేతిలో ఓడాడు. ఈ పోరు గంటకు పైగా జరిగింది. తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం శ్రీకాంత్కు ఈ ఏడాది వరుసగా ఇది రెండోసారి. మలేసియా మాస్టర్స్లో తైవాన్ ఆటగాడు చౌ టియన్ చెన్పై తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు.
ఎనిమిదో సీడ్ షి యు కి (చైనా)తో జరిగిన మ్యాచులో ప్రణీత్ 21-16, 18-21, 10-21 తేడాతో ఓటమి చవిచూశాడు. చైనాకే చెందిన లు గ్వాంగ్ జు 21-17, 15-21, 10-21 తేడాతో సౌరభ్ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కిరెడ్డి జంట 8-21, 14-21 తేడాతో దక్షిణ కొరియా ద్వయం కో సంగ్ హ్యూన్, ఇయోమ్ హై వోన్ చేతిలో ఓటమిపాలయింది.
భారత టెన్నిస్ యువ ఆటగాడు ప్రజ్నేష్ గుణేశ్వరన్ సీజన్ తొలి గ్రాండ్స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెయిన్ డ్రాకు చేరువయ్యాడు. మంగళవారం జరిగిన సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ప్రజ్నేష్ 6-2, 6-4తో స్థానిక ఆటగాడు హ్యారీ బుర్చీర్ను ఓడించి యానిక్ హన్మాన్ (జర్మనీ)తో చివరి రౌండ్ పోరుకు సిద్ధమయ్యాడు. రామ్కుమార్ రామనాథన్, అంకితా రైనా తొలి రౌండ్లో ప్రత్యర్థుల చేతిలో ఓడి క్వాలిఫయింగ్లోనే నిష్క్రమించారు.