న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు సోమవారం పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వరించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సింధు అవార్డును స్వీకరించారు. సింధు రియోలో జరిగిన ఒలింపిక్స్లో సిల్వర్ పతకం గెలవగా.. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ను గెలుచుకున్నది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. 2020కిగానూ వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మ అవార్డుల్ని ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేశారు.
Keep winning for India, keep smiling, and make India proud @Pvsindhu1 https://t.co/iNoXIf7xeo pic.twitter.com/QzovKVTXR3
— Kiren Rijiju (@KirenRijiju) November 8, 2021
దివంగత కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండేజ్లకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డులను ప్రదానం చేశారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుపొందిన పీవీ సిందు.. ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించారు. భారత్లో బ్యాడ్మింటన్కి వన్నె తెచ్చిన క్రీడాకారిణిగా ఆమె కితాబులు అందుకున్నారు. సింధుతో పాటు గాయకుడు పండిట్ చన్నూలాల్ మిశ్రాకు పద్మవిభూషణ్ దక్కగా.. ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్, నటి కంగనా రనౌత్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్లు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
అద్భుత ఆటతీరుకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు అందుకున్నారు పీవీ సింధు. 2015లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సింధు.. 2017లోనే పద్మభూషణ్కు నామినేట్ అయ్యారు. అయితే తుది జాబితాలో మాత్రం ఆమె చోటు దక్కించుకోలేకపోయారు. తాజాగా ఆ పురస్కారం కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరిపోయింది. భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పురస్కారం 'పద్మభూషణ్' అందుకోవడంపై సింధుకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ ఏడాది ప్రభుత్వం 119 పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంట్లో ఏడు పద్మ విభూషణ్, పది పద్మభూషణ్, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డులు అందుకున్నవారిలో 29 మంది మహిళలు ఉన్నారు. మరో 16 మందికి మరణానంతరం అవార్డులను ఇచ్చారు. పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో ఓ ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు.