భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత్ను విజేతగా నిలిపారు. ఫైనల్లో థాయ్లాండ్ను 3-2తో చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ స్వర్ణం సాధించడం ఇదే ప్రథమం. గతంలో కనీసం పతకం కూడా సాధించని భారత మహిళా జట్టు ఈ సారి అద్భుత ప్రదర్శన చేసింది.
భారత్ జట్టు విజేతగా నిలవడంలో 17 ఏళ్ల అన్మోల్ ఖర్బ్ పోరాటం అద్వితీయం. 2-2తో టైటిల్ పోరు ఉత్కంఠగా మారిన మ్యాచ్లో వరల్డ్ ర్యాంక్ 472 అయిన అన్మోల్.. 45వ ర్యాంకర్ చైకీవాంగ్ను వరుస గేమ్ల్లో ఓడించి దేశానికి చారిత్రక విజయాన్ని అందించింది. 21-14, 21-9 తో ప్రత్యర్థిని చిత్తుచేసింది.

ఫైనల్ను పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రారంభ మ్యాచ్లో సుపనిడ కాటెథాంగ్ను 21-12, 21-12తో ఓడించింది. ఆ తర్వాత అదే జోరును భారత జట్టు డబుల్స్లో కూడా కొనసాగించింది. పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడీ 21-16, 18-21, 21-16 తేడాతో గెలిచింది. తొలి గేమ్లో పైచేయి సాధించిన ట్రీసా-గాయత్రి రెండో గేమ్లో తడబడింది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్లో అద్భుత ఆటతో భారత్కు ఆధిక్యాన్ని అందించింది.
అయితే తర్వాత జరిగిన సింగిల్స్లో అస్మిత చలిహా పరాజయాన్ని చవిచూసింది. 11-21, 14-21తో ఓడింది. అనంతరం డబుల్స్ను థాయ్లాండ్ సత్తాచాటి 2-2తో ఫైనల్ స్కోరును సమం చేసింది. ప్రియ-శృతి జోడీ ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. 11-21, 9-21 ఓటమిపాలైంది. ఆఖర్లో నిర్ణయాత్మక పోరులో అన్మోల్ సంచలన ప్రదర్శనతో జట్టును గెలిపించింది. శనివారం జరిగిన సెమీస్లో 3-2తో జపాన్ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే.