హైదరాబాద్: ఢిల్లీ వేదికగా జరగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్లకు సులువైన డ్రా ఎదురైంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో సింధు రెండో సీడ్గా.. సైనా ఐదో సీడ్గా బరిలో దిగుతున్నారు.
ఐదు నిమిషాలు ఆలస్యం కావడం వల్లే: ఉగ్రదాడిపై బంగ్లా వీడియో అనలిస్ట్
మరోవైపు ఇటీవలే ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్గా నిలిచిన చెన్ యుఫెయ్ (చైనా)తో పాటు పురుషుల సింగిల్స్లో షై యుకి (చైనా)లకు టాప్ సీడింగ్స్ దక్కాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ముగ్ధతో సింధు, యన్యాన్ (చైనా)తో సైనా, ఇంతానన్ రచనోక్ (థాయ్లాండ్)తో సాయి ఉత్తేజితరావు, చనాంచిద (థాయ్లాండ్)తో వృశాలి తలపడతారు.
సైనా క్వార్టర్స్కు చేరితే రచనోక్ ఎదురయ్యే అవకాశం ఉంది. సింధుకు మాత్రం సెమీస్ వరకు ఎదురుండకపోవచ్చు. పురుషుల విభాగంలో 2015 విజేత కిడాంబి శ్రీకాంత్కు మూడో సీడ్ దక్కింది. కశ్యప్, సమీర్ వర్మ, గురుసాయిదత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వాంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)తో కిదాంబి శ్రీకాంత్, రస్ముస్ గెమ్కీ (డెన్మార్క్)తో సమీర్వర్మ, లీ చుక్ (హాంకాంగ్)తో పారుపల్లి కశ్యప్, తమాసిన్ (థాయ్లాండ్)తో గురుసాయిదత్, కాంటఫాన్ (థాయ్లాండ్)తో ప్రణయ్, టామి సుగియార్తో (జపాన్)తో శుభంకర్ దేవ్, వాంగ్ వీ (చైనీస్ తైపీ)తో అజయ్ జయరాం, క్వాలిఫయర్తో సాయి ప్రణీత్ పోటీపడతారు.