గత కొంత కాలం పాటు పేలవ ఫామ్ తో సతమతమైన స్టార్ షట్లర్ పీవీ సింధు..గతేడాది చివర్లో సయ్యద్ మోదీ గ్రాండ్ప్రి టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియా ఓపెన్ బరిలో దిగిన ఆమె.. కొత్త ఏడాదిలో గతంలోలా మళ్లీ విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఆట పట్ల తపన, విజయాలు సాధించాలనే కసి తనలో అస్సలు తగ్గలేదని చెప్పుకొచ్చింది.
ఆ బంధం ఎంతో కీలకం
ప్రస్తుతం సింధు బెంగళూరులోని కోచ్ ఇర్వాన్సియా ఆధ్వర్యంలో సాధన చేస్తోంది. ఈ సారి వ్యక్తిగత కోచ్ దగ్గర సాధన చేయడం కాకుండా బృంద శిక్షణలోకి మారింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. "అతడు మహిళల సింగిల్స్ కోచే. నాతో పాటు మరి కొంతమందికి శిక్షణ ఇస్తున్నాడు. మేం ఇప్పుడే కదా మొదలుపెట్టింది తన ఆలోచనలేంటో అర్థం కావాలంటే రెండు ట్రైనింగ్ సెషన్లు కంప్లీట్ అవ్వాలి. అతడి గురించి చాలా విన్నాక.. తనే నాకు సరైన కోచ్ అనిపించింది. ప్రత్యర్థులను బట్టి వ్యూహాలు రచిస్తుంటాడు. ఆ శైలి చాలా బాగుంది. కోచ్, అథ్లెట్ మధ్య బంధం ఎంతో కీలకం."

మార్పుండాలి
"ఆటలో నేను మరింత వేగాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్లాలి. చాలా ఏళ్ల పాటు నుంచి ఆడుతున్నా. కాబట్టి ప్రత్యర్థులకు నా ఆట గురించి బాగా తెలిసి ఉంటుంది. నేనెలా ఆడుతాను, నా వ్యూహాలు ఏంటి అనేది వాళ్లు అంచనా వేస్తుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు నేను మార్చుకుంటూ ఉండాలి. కోచ్తో కలిసి వ్యూహాలు సరిగా రచ్చించాలి. ప్లాన్-ఎ ఫెయితే ప్లాన్-బిని అమలు చేసేలా కొనసాగాలి."
ఎన్నో సార్లు సందేహించా
"ఆటలో నా మీద నాకు నమ్మకం ఉండటమనేది ఎంతో కీలకం. పలు సార్లు గాయాలైనప్పుడు మళ్లీ పుంజుకోగలమా, అని సందేహించిన రోజులున్నాయి. 2015లో ఓ సారి అలానే జరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ పుంజుకుని, రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించాను. ఆ రోజు నుంచే నా జీవితం చాలా మారింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది."
అవి సాధించాలి
"నేను సాధించాల్సింది ఇంకా చాలా మిగిలి ఉంది. నాలో గెలవాలన్న కసి ఉంది. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో మరో మెడల్ సాధించాలి. ఆల్ఇంగ్లాండ్ టైటిళ్లు కూడా గెలవాలి. మనం ఎంత సాధించిన కూడా, ఇంకా ఎందుకు సాధించలేం అనే ప్రశ్న వేసుకోవాలి. దానికి ఔను అనే బదులు రావాలి" అని సింధు చెప్పుకొచ్చింది.