భారత్ స్టార్ షట్లర్లు సాత్విన్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సంచలన ప్రదర్శనతో మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లిన తొలి భారత ప్లేయర్లుగా చరిత్రకెక్కారు. సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన ప్రపంచ చాంపియన్, మూడో ర్యాంక్ జోడీ సియో సియింగ్, కాంగ్ మిన్ను చిత్తుగా ఓడించారు. 21-18, 22-20తో వరుస గేమ్ల్లో గెలిచి తుదిపోరుకు దూసుకెళ్లారు.
ఫైనల్లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్వన్ జంట లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్తో సాత్విక్-చిరాగ్ పోటీపడనున్నారు. కాగా, సెమీస్లో తొలి గేమ్లో ఆది నుంచి సాత్విక్ జోడీ ప్రతర్థిపై పైచేయి సాధించింది. బ్రేక్ సమయానికి 11-9తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ప్రత్యర్థి జోడీ తీవ్ర పోటీ ఇచ్చింది. దీంతో పోరు హొరాహొరీగా సాగింది. ర్యాలీ ఆటతో, మెరుపు షాట్లతో 21-18తో భారత్ జోడీ విజయం సాధించింది.

అయితే రెండో గేమ్ ఉత్కంఠగా సాగింది. కొరియా జంట సత్తాచాటడంతో భారత్ 14-20 పాయింట్లతో ఓటమి అంచుల్లో చిక్కుకుంది. ప్రత్యర్థి జోడి మరో పాయింట్ సాధిస్తే గేమ్ను సొంతం చేసుకుంటుంది. దీంతో రెండో గేమ్లో భారత్ ఓటమి దాదాపు ఖరారైందని అనుకున్నారంతా. కానీ సాత్విక్, చిరాగ్ ఓటమిని అంగీకరించలేదు. నిప్పులు చెరిగే షాట్లతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసింది. వరుస పాయింట్లతో స్కోరును సమం చేయడమేగాక, 22-20తో రెండో గేమ్ను సొంతం చేసుకుని ఫైనల్కు చేరింది.
చైనా జంటతో జరిగే ఫైనల్లోనూ సత్తాచాటి కెరీర్లో రెండో సూపర్ 1000 టైటిల్ సాధించాలని సాత్విక్-చిరాగ్ పట్టుదలతో ఉన్నారు. గతేడాది జూన్లో జరిగిన ఇండోనేసియా ఓపెన్లో సాత్విక్ జోడీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కెరీర్లో అదే ఆ జోడీకి తొలి సూపర్ 1000 టైటిల్. అయితే ఆ టోర్నీ సెమీస్లోనూ కొరియాకు చెందిన సియో సియింగ్, కాంగ్ మిన్ జోడీనే ఓడించి ఫైనల్కు చేరడం విశేషం.