రియో డీ జనోరీ: బ్రెజిల్లోని రియోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమై 6 రోజులు అయిపోయాయి. భారత్ మాత్రం ఇంతవరకూ ఖాతా తెరవలేదు. దేశ జనాభా పరంగా చూస్తే ఎంతో కింద స్థాయిలో ఉన్న దేశాలెన్నో పతకాలు సాధించి సగర్వంగా నిలవగా, ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభాను కలిగి ఉన్న భారత్ అభిమానులు ఎదురచూస్తూనే ఉన్నారు.
రియో ఒలింపిక్స్లో పతకాలు సాధిస్తారని ఆశ పెట్టుకున్న వారిలో ఇప్పటికే పలువురు క్రీడాకారులు ఇంటిదారి పట్టారు. షూటర్లు, టెన్నిస్లో పలువురు క్రీడాకారులు విఫలమైన సంగతి తెలిసిందే. షూటింగ్లో అభినవ్ బింద్రా, గగన్ నారంగ్లు ఇంటి దారి పట్టగా, పురుషుల, మహిళల డబుల్స్ విభాగంలో ఓడిపోయిన భారత్, మిక్సెడ్ డబుల్స్లో మాత్రం ఓ అడుగు వేసింది.
భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు రియో ఒలింపిక్స్లో శుభారంభం చేశారు. ఆతిథ్య దేశం బ్రెజిల్కు చెందిన విసింటె లొహయన్నైను సైనా నెహ్వాల్ 2-0 తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన పోరులో సైనావరుస గేముల్లో 21-17, 21-17తో ప్రత్యర్థిని చిత్తు చేసింది.

గురువారం నిర్వహించిన మహిళల సింగిల్స్ గ్రూప్ దశ మ్యాచుల్లో వీరిద్దరూ గెలుపు బోణీ చేయగా, గుత్తా జ్వాల, అశ్వని పొన్నప్ప జోడీ ఓడిపోయింది. మరోవైపు టెన్నిస్ విభాగంలో తొలి మ్యాచ్లో సానియా, బోపన్నల జోడీ గెలిచింది. కనీసం ఒక్క పతకమైనా వస్తుందని ఆశించిన ఆర్చరీ విభాగంలో భారత్కు నిరాశే ఎదురైంది.
రియో ఒలింపిక్స్లో దీపికాతో సహా ఆర్చరీ క్రీడాకారులందరూ విఫలమయ్యారు. ఇక పురుషుల హాకీ జట్టు నెదర్లాండ్స్ను ఓడించి నాకౌట్ స్థాయికి చేరుకోగా, మహిళల హాకీ జట్టు అమెరికా చేతిలో 3-0 తేడాతో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. ఇక బాక్సింగ్ విషయానికి వస్తే ఒక్క శివ థాపా ఒక్కడే పతక రేసులో మిగిలున్నాడు.
జిమ్నాస్టిక్స్లో దీపా కర్మాకర్ భారత్కు పతకం తెస్తుందా లేదా అన్న విషయం 14వ తేదీ గాని తేలదు. భారత్ నుంచి 118 మందితో రియోకు వెళ్లిన క్రీడాకారుల నుంచి తొలుత రెండు నుంచి మూడు స్వర్ణాలు సహా ఓ 10 వరకూ పతకాలు వస్తాయని అంచనాలు వేశారు.
అయితే ఇప్పుడు కనీసం భారత్ ఖాతా తెరిస్తే బాగుండని సగటు అభిమాని కోరుకుంటున్నాడు. రియో ఒలింపిక్స్లో భారత్ పతకం సాధిస్తుందనే ఆశతో 130 కోట్ల మంది భారతీయులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.