హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో ఈసారి టైటిల్ సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేస్తోంది. గతేడాది దుబాయ్ వేదికగా రన్నరప్గా నిలిచిన ఒలింపిక్ సిల్వర్ పతక విజేత ఇప్పుడు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పింది. డిసెంబర్ 12 నుంచి గ్వాంగ్జౌ (చైనా)లో జరిగే ఈ టోర్నీకి సిద్ధమయ్యేందుకు గతవారం సయ్యద్ మోడీ ఈవెంట్కు ఆమె గైర్హాజరైంది.
మూడో సారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికైన సింధు.. చక్కటి ఫామ్తో రాణిస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. 'ఈసారి తప్పకుండా మెరుగైన ఫలితం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నా. హేమాహేమీలు తలపడే ఈ ఈవెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉన్నాను. ప్రత్యర్థులంతా క్లిష్టమైన వారే. ఎవరికి ఎవరూ తీసిపోరు. కానీ నేను మాత్రం ఈసారి టైటిల్ చేజార్చుకోను' అని సింధు తెలిపింది.
23 ఏళ్ల సింధు.. ఈ ఏడాది నుంచి మంచి ఫామ్తో రాణించాలని ఆశిస్తోంది. ఆడిన మేజర్ ఈవెంట్లలో కాంస్యాలను గెలుచుకుంది. కామన్వెల్ గేమ్స్, ఆసియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్ షిప్లలో గెలుచుకోవడంతో పాటు.. ఇండియా ఓపెన్, థాయ్లాండ్ ఓపెన్లలో రన్నరప్గా నిలిచింది పీవీ సింధు.
ఫైనల్లో ఓడిపోవడం గురించి మరోసారి స్పందించిన పీవి సింధు.. 'చివరి వరకూ వచ్చి ఓడిపోవడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పరిస్థితిని అధిగమించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ, నేను ఆసియా గేమ్స్ ఫలితాల విషయం పట్ల సంతోషంగానే ఉన్నాను. మొత్తంగా చెప్పాలంటే కొన్ని బాధాకరమైన విషయాలతో పాటు కొన్ని విజయాలు కూడా ఉన్నాయనే చెప్పాలి' అని ముగించింది.