హైదరాబాద్: తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు సాగుతున్న ప్రచారానికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా తెర దించారు. జ్వాలా గుత్తా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారని ప్రచారం సాగింది. పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవితతో ఆమె సన్నిహితంగా మెలుగుతున్నారని, అందువల్ల ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరవచ్చునని పుకార్లు షికార్లు చేశాయి.
అదే సమయంలో ఆమె పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో కూడా చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆసక్తి లేదని ఆమె కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ను ప్రశంసలతో ముంచెత్తడంతో ఆ ప్రచారం సాగింది.

తాను స్టార్ కాంపెనర్ను కూడా కానని ఆమె అన్నారు. ఏ రాజకీయ పార్టీకి కూడా తాను స్టార్ కాంపెయినర్ కానని ఆమె చెప్పారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఆమె సోమవారం వివరణ ఇచ్చారు.
రాజకీయ ప్రవేశం గురించి తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని ఆమె చెప్పారు. రాజకీయాలంటే తనకు ఇష్టమని మాత్రమే చెప్పానని ఆమె అన్నారు. అంత మాత్రాన తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పడం కాదని ఆమె అన్నారు.